Tuesday, April 30, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మైసయ్య, జనార్ధన్‌లను అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఈ ఇద్దరు తండ్రీకొడుకులు కావడం గమనార్హం. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేసింది. ఢాక్యా నాయక్ నుండి రూ. 2 లక్షలకు ఎఇ ఎగ్జామ్ పేపర్ వీరు కొనుగోలు చేసినట్టుగా సిట్ బృందం గుర్తించింది. ఈ కేసులో నిందితుల జాబితా పెరిగిపోతోంది. విచారణ చేసే కొద్ది కొత్త కొత్త పేర్లు వెలుగు చూస్తున్నాయి. నిందితుల ఇచ్చిన సమాచారం, వారి ఫోన్ డేటా ఆధారంగా కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ఏడాది మార్చి మాసంలో టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ అంశం బయటకు వచ్చింది. మార్చి 12, 15, 16, తేదీల్లో జరగాల్సిన టౌన్ ప్లానింగ్, సివిల్ సర్జన్ నియామాకాల పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి వాయిదా వేసింది. టిఎస్‌పిఎస్‌సిలోని కంప్యూటర్లు హ్యాక్ అయినట్టుగా అనుమానించి ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించిన పోలీసులు టిఎస్‌పిఎస్‌సి కంప్యూటర్లు హ్యాక్ కాలేదని గుర్తించారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు విచారణను ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. గత ఏడాది అక్టోబర్ మాసం నుండి జరిగిన పరీక్షలకు సంబంధించి పరీక్ష పేపర్లు లీకైనట్టుగా గుర్తించింది. దీంతో కొన్ని పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేయగా, మరికొన్నింటినీ వాయిదా వేసింది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ కీలకంగా వ్యవహరించినట్టుగా గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News