Tuesday, May 14, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు

- Advertisement -
- Advertisement -

డిఎ 4 శాతం పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం
కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
ఖజానాపై రూ.15,014 కోట్ల భారం
అలవెన్సులు కూడా పెంపు
ఉజ్వల గ్యాస్ సబ్సిడీ మరో ఏడాది పెంపు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 46 శాతంగా ఉన్న డిఎ 50 శాతానికి చేరుకుంటుంది. 2024 జనవరి 1నుంచే ఈ పెంపు అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తాజా నిర్ణయంతో కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీడియాకు చెప్పారు.

డిఎ, పెన్షనర్ల డిఆర్ పెంపు కారణంగా 202425 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఖజానాపై రూ.15,014 కోట్ల మేర భారం పడనుంది. డిఎ పెంపుతో పాటుగా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ లాంటి ఇతర అలవెన్సులను కూడా 25 శాతం పెంచారు. ఇంటి అద్దె అలవెన్స్( హెచ్‌ఆర్ అలవెన్స్)ను కూడా బేసిక్ వేతనంలో ఇప్పుడున్న 27 శాతం, 19 శాతం, 9 శాతంనుంచి 30 శాతం, 20 శాతం, 10 శాతానికి పెంచారు. అలాగే గ్రాట్యుటీ ప్రయోజనాల సీలింగ్‌ను కూడా ఇప్పుడున్న రూ.20 లక్షలనుంచి రూ.25 లక్షలకు పెంచారు.వివిధ అలవెన్సుల పెంపు భారం ఏటా రూ.9,400 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News