హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నంకు చెందిన గిరిజా ప్రియదర్శిని.. 1995లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విశాఖ న్యాయస్థానంలో ఏడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. 2008లో జిల్లా అడిషనల్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేళ్లు, విజయనగరం మొదటి అదనపు జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పని చేశారు.
2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్గా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా పని చేసిన ఆమె ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టు చిఫ్ జడ్జిగా, రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా పని చేశారు. ఆ తర్వాత రాష్ట్ర హై కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. గిరిజా ప్రియదర్శిని మృతిపట్ల తోటి జడ్జిలు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.