హైదరాబాద్: కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. కొత్త వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు. రూ.3,900 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభావేదికపై నుంచి 7 జాతీయ రహదారులను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, ఎంపిలు నగేశ్, వంశీ, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి హెడ్మా బొజ్జూ, తదితరులు పాల్గొన్నారు. ఈ సభా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కశ్మీర్ కు రైల్వే లైన్లు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదే నని ప్రశంసించారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశారని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు కేటాయించిందని చెప్పారు.
హైవేల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, సమయం తగ్గిందని తెలిపారు. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. హైవేల విస్తీర్ణం 5 వేల కిలోమీటర్లు దాటిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో హైవేల నిర్మాణ పనులకు.. కేంద్రం రూ.1.25 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు..అభివృద్ధి విషయంలో కాదని అన్నారు. ఈ సభా సమావేశంలో బండి మాట్లాడారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధని మోడీ నమ్ముతారని చెప్పారు. గత పదేళ్లలో తెలంగాణలో హైవేల విస్తీర్ణం 5,100 కి.మీ.కు చేరుకుందని, తెలంగాణలో హైవేల నిర్మాణ పనులకు..కేంద్రం రూ. 1.25 లక్షల కోట్లు కేటాయించిందని బండి సంజయ్ తెలియజేశారు.