ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజీలో కుద బెట్టి, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని లక్ష 75 వేల ఎకరాల టిజిఐఐసి భూములను స్టాక్ ఎక్స్చేంజీలో తాకట్టు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఎంఎల్సి కవిత విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ అయిన టిజిఐఐసిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రహస్య జిఒ విడుదల చేసిందన్నారు. టిజిఐఐసి హోదాను మార్చడం ద్వారా రూ.వేల కోట్ల అదనపు రుణాలు సేకరించాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఎజెండాగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల సంపద అయిన టిజిఐఐసి భూములను స్టాక్ ఎక్స్చేంజీలో తాకట్టు పెట్టి భారీ ఎత్తున అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచిందని చెప్పారు. టిజిఐఐసి హోదాను మార్చిన విషయం ప్రజలను చెప్పకుండా ఎందుకు దాచి పెట్టారని నిలదీశారు. రహస్యంగా, దొంగచాటు జిఒ జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంపద అయిన భూములను స్టాక్ ఎక్స్చేంజీలో తాకట్టు పెట్టాల్సిన అవసనరం ఏమొచ్చిందని అడిగారు. రేపు స్టాక్ ఎక్స్చేంజీలో నష్టం జరిగితే తెలంగాణ భూముల భవితవ్యం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. టిజిఐఐసిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.1.80 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిందని కవిత వివరించారు. స్వల్ప వ్యవధిలో ఇంతటి భారీ అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదని అన్నారు. గతంలో చేసిన అప్పులకు రూ.80 వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చెల్లించిందని చెప్పారు. మిగతా లక్ష కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి భారీ ఎత్తున కమీషన్లు తీసుకొని బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారని ఆరోపించారు. తాను పూర్తి ఆధారాలతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. ఇది 20 శాతం కమీషన్ సర్కార్ అని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి రేవంత్ రెడ్డి కమీషన్ల రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా సొమ్ము తన సొంత ఖజానాకు చేర్చుకున్నారని ఆరోపించారు.
తాను చెప్పేది అబద్ధమైతే అప్పులు, రుణాల తిరిగి చెల్లింపులు, ప్రభుత్వ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ మంత్రికి చెందిన సొంత కాంట్రాక్టు సంస్థకు, మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి బిల్లులు చెల్లించడం మినహా రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదన్నారు. సుమారు రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారని, పెద్ద ఎత్తున చెట్లను నరికేసి ప్రకృతిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చేశారని గుర్తు చేశారు.
నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు
తా ను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానని, 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని ఎంఎల్సి కవిత తెలిపారు. రా ష్ట్రంలో పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్ర స్తావించాను అని స్పష్టం చేశారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని, ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదని చెప్పారు. తనపై కొ ందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయని అన్నారు.ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా. ఇంకా కష్టపెడతారా..? అని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే స్పందిస్తానని పేర్కొన్నారు.