వరంగల్లో కూల్చివేతలపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బుల్డోజర్ కంపెనీలతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందా? అని కెటిఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు, దుకాణాలను ఎందుకు కూల్చుతున్నారని, వారి జీవితాలను బుల్డోజర్ల కింద ఎందుకు నలిపేస్తున్నారని ఆయన నిలదీశారు. తెలంగాణలో ప్రతిరోజూ పేదల ఇళ్లతో పాటు వారి జీవితాలపై బుల్డోజర్ల తో దాడి చేయడం ఏంటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఏమైనా ఉందా అని నిలదీశారు.
తాజాగా వరంగల్ లో కూల్చివేతలపై ఎక్స్ వేదికగా పోస్టు చేసిన కేటీఆర్ మిస్ వరల్ కంటెస్టెంట్స్ వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో వరంగల్ లో అధికారులు పేదల ఇళ్లను కూల్చుతున్నారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమేనా ప్రజాపాలన అంటే అని నిలదీశారు. రాజభవనాలలో విలాసవంతమైన విందులు చేసి రూ. 200 కోట్లతో పాటు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిన తర్వాత మీ క్రూరమైన బుల్డోజర్లతో పేదల జీవితాలను నలిపివేయాల్సి వచ్చిందా అని నిలదీశారు. ఇంత చేశాక మీది ప్రజాపాలన అని పిలుచుకోవడం హాస్యాస్పదంగా ఉందని, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.