Saturday, May 17, 2025

భావితరాల కోసం కలత చెందిన దార్శనికులు

- Advertisement -
- Advertisement -

భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌గా ప్రసిద్ధుడయిన భీంరావ్ రాంజీ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ రూపశిల్పి తొలి కేంద్ర న్యాయశాఖా మంత్రి, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త. ముఖ్యంగా అంటరానితనం, కుల నిర్మూలన కోసం సంఘర్షించిన రాజకీయవేత్త. దేశంలో నవయాన బౌద్ధానికి దారులు వేసిన ఆధునిక నవ బౌద్ధుడు. కాలం గడుస్తున్న కొద్దీ ప్రజలు అంబేద్కర్‌ను బాగా అర్థం చేసుసుంటున్నారు. దళితులు, బహుజనులు మాత్రమే కాదు, అన్ని వర్ణాల వారు, అన్ని మతాల వారూ అంబేద్కర్ చూపిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే 1956 మార్చి 18న ఆగ్రా నగరంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఆ రోజు డా. బిఆర్ అంబేద్కర్ (1891 ఏప్రిల్ 14 1956 డిసెంబర్ 6) తన అనుచరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై, ఉన్నఫళాన కంటతడిపెట్టారు. ‘ఏమిటీ! ఏమైందీ?’ అని అనుచరులు కంగారు పడి అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అవి ఇలా ఉన్నాయి. తన జాతి వాసుల్ని తను ఎలా చూడాలనుకున్నారు? వాళ్లు ఎలా తయారయ్యారు? అన్న విషయం బేరీజు వేసి చూపారు.

తన వాళ్లను ఉద్దేశించి ఇలా అన్నారు. నేనేమో మిమ్మల్ని రాజులను చేయాలనుకున్నాను. మీరేమో లాభసాటి నౌకర్లలా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. నేనేమో మిమ్మల్ని రత్నాలుగా చూడాలనుకున్నాను. మీరేమో మట్టి పెళ్లలుగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు.నేనేమో మీరు సంఘటిత శక్తిగా ఎదగాలనుకున్నాను. స్పృహ లేని ఉద్యోగాల కోసం, స్ఫూర్తి లేని రాజకీయ నాయకుల కోసం, సంఘటితం కాని సంస్కర్తల కోసమేనా నా ఈ కన్నీళ్లూ? ‘మీరంతా నా అనుచరులు గనుక, నా జాతి వాసుల కోసం, నా దేశ ప్రజల కోసం నేను పడుతున్న ఆవేదనను మీరు సరిగా అర్థం చేసుకుంటారని భావిస్తాను. నా కన్నీళ్లు వృథాపోవనీ, వాటి విలువను మీరు వారికి తెలియజెప్తూ ఉంటారని ఆశిస్తాను!’ అని అన్నారు అంబేద్కర్. భవిష్యత్తరాల అభ్యున్నతి కోసం దా. బి.ఆర్ అంబేద్కర్ పడిన ఆవేదన వృథా కాకూడదు. మనం మన ముందు తరాల్ని చైతన్యవంతులగా తీర్చిదిద్దడం ఒక

బాధ్యతగా స్వీకరించాలి!
నేటి బాలబాలికలే రేపటి పౌరులు గనక, వారి విద్యాభ్యాసం ఎలా జరగాలి? వారు ఉన్నతమైన ఆశయాలతో ఎలా పెరగాలి? అన్న విషయం అబ్రహం లింకన్ (12 ఫిబ్రవరి 1809 15 ఏప్రిల్ 1865) ఒక ఉత్తరంలో నమోదు చేశారు. అమెరికాకు పదహారవ అధ్యక్షడైన లింకన్, తన చిన్న కుమారుడైన ట్యాడ్ లింకన్‌కు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి ఒక లేఖ రాశారు. అందులో అనేక విషయాలున్నాయి. ఇది కేవలం తన కుమారుడి కోసం రాసిందే అయినా, ఆయన దృష్టిలో ప్రపంచ యువత ఎలా ఎదగాలి అన్న విషయం చర్చించారు. ఆ ఉత్తరం ఇలా సాగుతుంది ప్రతి ఉపాధ్యాయుడూ ఈ ఉత్తరం తనకు వచ్చినట్టుగానే భావించుకోవాలి!

గౌరవనీయ ఉపాధ్యాయుడా!
ఈ భూమి మీది మనుషులందరూ న్యాయమైన వాళ్లు కాదు. నిజమైన వాళ్లూ కాదు. ఈ విషయాలు మా అబ్బాయి కచ్చితంగా తెలుసుకోవాలి! మీరు మా వాడికి ఇవి నేర్పించాలి! ప్రతి ఉత్తముడికి ఒక నీచుడున్నాడు. ప్రతి స్వార్థ రాజకీయ నాయకుడికీ అంకిత భావంతో పని చేసే ఒక నాయకుడున్నాడు. ప్రతి శత్రువుకీ మనకు ఒక మిత్రుడున్నాడు. లేని దాని గురించి దిగులుపడే గుణాన్ని మా వాడి లోంచి పారద్రోలండి. వీలైతే నిశ్శబ్దంగా నవ్వుకోగల రహస్యాన్ని వాడి గుప్పిట్లో పెట్టండి. తనకు కొన్ని విషయాలు చిన్నతనంలోనే తెలియాలి. అల్లరి చిల్లర కబుర్లు ఆసక్తి కలిగిస్తాయి కానీ, వాడికి పుస్తకాల మత్తు, మహత్తూ ఏమిటన్నది అర్థం చేయించండి! అలాగే ఆకాశంలోని పక్షులు, తేనెటీగలు, పచ్చటి కొండల అనంత రహస్యాలను అన్వేషించడానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పండి. మోసం చేయడం కంటే ఫెయిల్ కావడమే గౌరవప్రదమైన అంశమని, పాఠశాలలో పిల్లలకు మీరు తప్పక బోధించాలి.

ఇతరులు తప్పు పడుతున్నారని కాకుండా తన ఆలోచలనపై తనకు దృఢమైన విశ్వాసం ఉంచుకోవడం మంచిదని చెప్పండి. మర్యాదస్తులతో మర్యాదగా, మొండి వాళ్లతో మొండిగా మసలుకోవాలన్నది నేర్పించండి! వీలైతే మా అబ్బాయికి ఈ జ్ఞానాన్ని పంచండి అందరూ వెళుతున్నారు కాబట్టి, మనమూ ఆ దారిలోనే పరిగెత్తుదామన్న గొర్రెదాటు పద్ధతిని అనుసరించకుండా నిగ్రహించుకునేట్లు చేయండి! అయితే సత్యాసత్యాల నిగ్గు తేల్చుకుని, అసలైన దాన్ని మాత్రమే స్వీకరించాలన్నది నేర్పించండి! మీకు సాధ్యమైతే ఈ కింది మెళకువలు కూడా నేర్పించండి దుఃఖంలో నవ్వాలని, కన్నీళ్లు వస్తే సిగ్గు పడాల్సింది ఏమీ లేదని, ప్రతి దానికీ రంధ్రాన్వేషణ చేసే వాడిని పరిహసించాలని అలాగే ప్రతి చిన్న పనినీ పొగిడే వాడి గూర్చి జాగ్రత్తగా మసలుకోవాలన్నది బోధించండి! తన కండను, మెదడును అత్యంత ఎక్కువ ధర చెల్లించే వాడికి అవసరమైతే అమ్ముకోవచ్చు కానీ, తన మనసుకు, అంతరాత్మకు ఎప్పుడూ, ఎక్కడా, ఎన్నడూ వెల నిర్ణయించకూడదనీ, ఆ పరిస్థితి అసలు తెచ్చుకొనే తెచ్చుకో కూడదని బాగా అర్థమయ్యేట్టు చెప్పండి! పనికిమాలిన అరుపులకు చెవి ఒగ్గకూడదని, తమ సత్యమని బలీయంగా నమ్మిన దాని కోసం ఎదురొడ్డి పోరాడాలని చెప్పండి. మా అబ్బాయితో కాస్తా సున్నితంగానే వ్యవహరించండి. కానీ, మరీ ముద్దు చేయకండి.

ఎందుకంటే ఉక్కు దృఢత్వం తెలిసేది అగ్ని పరీక్షకు గురైనప్పుడే కదా? ధైర్యంగా ఉండగలిగే సహనం తనకు కావాలి! అయితే, అవసరమైనప్పుడు తన అసహనాన్ని ప్రదర్శించే ధైర్యం కూడా తనకు ఉండాలి! ఎల్లవేళలా తన మీద తనకు అచంచలమైన విశ్వాసం ఉండేలా తీర్చిదిద్దండి. అప్పుడే ఆ వయసు పిల్లలకు మానవ జాతి మీద ఎనలేని విశ్వాసం ఏర్పడుతుంది. ఇవన్నీ చిన్న కోరికలేమీ కావు చాలా పెద్ద కోరికలే. కానీ, ప్రయత్నించి చూడండి. ముద్దులొలికే నా బంగారు తండ్రి కోసం ఇందులో మీరు ఏమేమీ చేయగలరో ప్రయత్నించి చూడండి. మీ ప్రయత్నం సఫలమైతే, ఆ ఫలితం నా కుమారుడొక్కడికే కాదు మొత్తం కొన్ని తరాలకు అందించిన వారవుతారు. దయచేసి ఆలోచించండి. అబ్రహం లింకన్; ఫాదర్

ఆఫ్ ట్యాడ్ లింకన్ (పేరెంట్)
19 అక్టోబర్ 1952 షిల్లాంగ్ మేఘాలయలో జరిగిన పెద్ద బహిరంగ సభలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఉపన్యాసం ఈ విధంగా సాగింది. దేశమంటే ఏమిటి? అంకిత భావంతో పని చేసే దేశ నాయకులు చేయాల్సింది ఏమిటి? అన్నది ఆయన చెప్పకనే చెప్పారు.‘దేశమంటే కొన్ని పర్వతాలు, కొన్ని నదులు, మైదానాలు, పొలాలు మాత్రమే కాదు. పెద్దవీ చిన్నవీ అయిన నగరాలు, పట్టణాలు,గ్రామాలు మాత్రమే కాదు. దేశమంటే ఇవన్నీ ఉంటాయి కానీ, దేశమంటే ఇవి మాత్రమే కాదు. దేశమంటే, దేశంలో నివసిస్తున్నప్రజలు. అందువల్ల, నా భారత దేశంలో ఉన్న ప్రజలను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. గతంలో ఉన్న ప్రజలను, ప్రస్తుతం ఉన్న ప్రజలను,వారి జీవితాలను చాలా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చాను.

దేశమంతా విస్తృతంగా పర్యటిస్తూ వచ్చాను. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణపు అంచు కన్యాకుమారి దాకా అలాగే పశ్చిమాన ఉన్న మన సరిహద్దుల నుండి ఇటు తూర్పున ఉన్న సముద్ర తీరం దాకా లక్షలాది ప్రజలను కలిశాను. వారి కళ్లలోకి సూటిగా చూస్తూ వారి మనోభావాల్ని పసిగట్టాను. వారి ఆశలేమిటి? ఆకాంక్ష లేమిటి? తెలుసుకున్నాను. వారు చెప్పేదేమిటో విన్నాను. వారు చెప్పలేక పోయిందేమిటో కూడా అంచనా వేసుకున్నాను. మొత్తానికి మొత్తంగా, నా దేశ ప్రజల్ని కొంతలోకొంత అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఇది నాకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే విషయం! ఆనాటి పండిట్ నెహ్రూ ఉపన్యాసం పూర్తి పాఠం జవహర్ లాల్ నెహ్రూ సెలెక్టెడ్ వర్క్ సెకండ్ సీరిస్ వాల్యూమ్ 20; పేజీ; నెం; 3 లో ఉంది. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో ఆరాధనా భావం పెరిగిపోతూ ఉంది.

దీన్ని అరికట్టకపోతే ఆయన మరో సీజర్‌లా తయారయ్యే అవకాశం ఉంది. ఇది పార్టీ మనుగడకు ఎంత మాత్రం సరైంది కాదు” చాణక్య. నెహ్రూ అంటే గిట్టని వారెవరో ఇలా రాస్తున్నారని అందరూ అనుకునేవారు. ఇంతకూ ఎవరా చాణక్య అని కొందరు ఆరా తీసేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాణక్య ఎవరో కాదు. పండిట్ నెహ్రూయే! అది ఆయన కలం పేరు. ఆ రోజుల్లో కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో పండిట్ నెహ్రూయే స్వయంగా ‘చాణక్య’ అనే పేరుతో విరివిగా రాస్తుండేవారు. ఈ కాలంలో అలాంటి నిజాయితీపరుల్ని చూడగలమా? ఆయన దార్శనికతను అర్థం చేసుకోలేని వారు మాత్రమే. ఆయనను తక్కువ చేసి మాట్లాడగలరు. వివేకవంతుడికి, మూర్ఖుడికీ పోలికలు ఉండవు కదా!

  • డాక్టర్ దేవరాజు మహారాజు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News