Sunday, May 18, 2025

అటవీ, అభయారణ్య చట్టాలకు లోబడి ఏజెన్సీల్లో పనులు పూర్తి చేయాలి: సీతక్క

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో నూతన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనులను అటవీ, అభయారణ్య చట్టాలకు లోబడి త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఈ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. పిసిసిఎఫ్ డాక్టర్ జి సువర్ణ, ములుగు, మహబూబాబాద్ డిఎఫ్‌ఓలు, ఐటీడీఏ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గుడులు, బడులు, ఆస్పత్రులు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం అడ్డు కాదని గుర్తు చేశారు. అందుకే అటవీ, అభయారణ్య చట్టాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ఏరియాల్లో దేవాదుల వంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న ప్రజల అవసరం మేరకు రోడ్లు నిర్మించడంలో అభ్యంతరాలు ఎందుకని అటవీ శాఖ అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నించారు.

దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని సూచించిన మంత్రి సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం ఆమె తెలిపారు. అటవీశాఖ అధికారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటిడిఏ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కనీస రహదారి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ములుగు నియోజకవర్గ ఏజెన్సీలో పెండింగ్ పనుల జాబితాను అటవీ శాఖ అధికారులకు అందించి ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ విభాగంతో సమావేశం చేసుకొని పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఎలాంటి ఆటంకాలు కల్పించబోము

మంత్రి సీతక్క ఆదేశాలతో కనీస రహదారుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని అటవీ అధికారులు చెప్పారు. అటవీ, అభయారణ్య చట్టాలు నిబంధనలకు అనుగుణంగా రోడ్లు, కల్వర్టులు, లోకాజ్ వే వంటి వాటి నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని పిసిసిఎఫ్, అటవీ శాఖ అధికారులు, డిఎఫ్‌ఓలు హామీ ఇచ్చారు. తారు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అటవీ అభయారణ్య చట్టాలు అంగీకరించని పక్షంలో దృఢంగా పటిష్టంగా ఉండేలా గ్రావెల్, మట్టి రోడ్ల నిర్మాణాలను చేపడతామని అటవీశాఖ అధికారులు మంత్రికి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News