Saturday, May 24, 2025

నేడు నీతి ఆయోగ్ భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేడు ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. 2018 తర్వాత తొలిసారిగా జరిగే నీతిఆయోగ్ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం రేవంత్ హాజరవుతున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో శనివారం నీతిఆయోగ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి అల్పాహారం చేయనున్నారు. అల్పాహారం అనంతరం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని గ్రూప్ ఫొటో కార్యక్రమంలో పాల్గొననున్నారు.

రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదిక
వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ ఎజెండాగా ఏర్పాటు చేసిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదల్చుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించ నున్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్‌తో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్‌లో ముందున్న తెలంగాణ ఆయా రంగాల్లో మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు.

యూనివర్సిటీల ఏర్పాటుపై ప్రసంగించనున్న సిఎం
ఆర్‌ఆర్‌ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటిఆర్‌లుగా మారుస్తూ మౌలిక వసతులు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై సిఎం ప్రసంగించ నున్నారు. సాగు రంగం అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్న బియ్యం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500లకే సిలిండర్ సరఫరాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. సామాజిక సాధికారితలో భాగంగా ఎస్సీ కులాల ఉప వర్గీకరణ, కుల గణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News