ముంబై: కిందటి ఐపిఎల్ సీజన్లో హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (Mumbai indians ) అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అద్భుత కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్కు ఐపిఎల్ ట్రోఫీ సాధించి పెట్టిన హార్దిక్ను ముంబై ఇండియన్స్ అనూహ్య రీతిలో సొంతం చేసుకుంది. అతన్ని జట్టులోకి తీసుకోవడమే కాకుండా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కానీ గుజరాత్ను ముందుండి నడిపించిన హార్దిక్ ముంబై కెప్టెన్గా మాత్రం పూర్తిగా తేలిపోయాడు. సీజన్ 2024లో ముంబై చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి.
అతన్ని తప్పించి రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఊపందుకుంది. కానీ ముంబై యాజమాన్యం మాత్రం హార్దిక్పైనే నమ్మకాన్ని ఉంచింది. సీజన్ 2025లో మళ్లీ హార్దిక్కే సారథ్యం అప్పగించింది. మరోవైపు హార్దిక్ సారథ్యంలో బరిలోకి దిగిన ముంబై ఆరంభ మ్యాచుల్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. వరుస ఓటములతో సతమతమైంది. దీంతో మరోసారి హార్దిక్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని విమర్శలు వచ్చినా హార్దిక్ ఒత్తిడికి గురికాలేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు పోయాడు. సీనియర్లు రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగాడు. అసాధారణ కెప్టెన్సీతో జట్టులో కొత్త జోష్ను నింపాడు. సహచరుల్లో ఎప్పటికప్పుడూ ఉత్సాహాన్ని నింపుతూ జట్టును లక్షం దిశగా నడిపించాడు.
ఒక దశలో ప్లేఆఫ్ మాట అటుంచి కనీసం టాప్8లోనైనా నిలుస్తుందా లేదా అని భావించిన ముంబైని (Mumbai indians ) ఏకంగా టాప్4లో నిలిపి విమర్శకులు నోళ్లను మూయించాడు. ముంబై ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిందంటే దానికి ప్రధాన కారణం హార్దిక్ సారథ్య నైపుణ్యమే కారణమని చెప్పాలి. కెప్టెన్గా, ఆటగాడిగా జట్టును ముందుండి నడపించాడు. సహచరులు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రజత్ పటిదార్ల మాదిరిగానే తన జట్టును ప్లేఆఫ్కు చేర్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రస్తుతం ముంబై ఆటను గమనిస్తే మరోసారి ఐపిఎల్ ట్రోఫీని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న ముంబైకి హార్దిక్ అద్భుత కెప్టెన్సీ తోడు కావడంతో ముంబై టైటిల్ ఫేవరెట్గా మారింది.