ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలోని 10 మందిపై మొత్తం రూ.38 లక్షల రివార్డు ఉంది. పీఎల్జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ) బెటాలియన్లో చురుకుగా ఉన్న నలుగురితో సహా మొత్తం 18 మంది సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు మంగళవారం లొంగిపోయారు. అమానవీయమైన, శుష్క మావోయిస్టు భావజాలం, స్థానిక గిరిజనులపై అరాచకాలు, తదితర చర్యలకు విసిగి తాము లొంగిపోయినట్టు వారు వెల్లడించారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు. మారుమూల గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నియాద్ నెల్లనార్ ( మీ మంచి గ్రామం) పథకానికి ప్రభావితమయ్యామని వారు పేర్కొన్నారని ఎస్పీ చెప్పారు.
అలాగే పునరావాస విధానం వల్ల వారు లొంగిపోయారని తెలిపారు.లొంగిపోయిన వారిలో మావోయిస్టు పిఎల్జిఎ బెటాలియన్ నెం.1 ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యుడు మడ్కమ్ ఆయతా(25), అదే బెటాలియన్ సభ్యుడు భాస్కర్ అలియాస్ భోగం లక్క (26) ఉన్నారు. వీరిపై చెరో రూ. 8 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు మడ్కమ్ కమ్లు (25), లక్ష్మణ్ అలియాస్ మద్వీ చాన్ను (28) పై చెరో రూ.5 లక్షల రివార్డు ఉంది. మిగతా ఆరుగురిపై రూ.2 లక్షల వంతున రివార్డు ఉంది. లొంగిపోయిన వీరందరికీ రూ. 50 వేలు వంతున ఆర్థిక సాయం అందించామని, ప్రభుత్వ విధానం ప్రకారం తదుపరి పునరావాసం కల్పిస్తామని ఎస్పి తెలిపారు. సుక్మాతో కలిపి బస్తర్ రీజియన్లో గత ఏడాది 792 మంది నక్సల్స్ లొంగిపోయారు.