కమ్యూనిస్టు స్వాప్నికుడు, కోల్ బెల్ట్ ఉద్యమ నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, మానవ హక్కుల కార్యకర్త, ప్రత్యేక తెలంగాణ పోరాట యోధుడు ఎం.డి. మునీర్ 1959 డిసెంబర్ 14 నాడు జన్మించారు. పోరాటాల పురిటి గడ్డలో జన్మించిన ఆయన చిన్ననాటి నుండే ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకున్నారు. విద్యార్థి దశలో ఆయన ఎఐఎస్ ఎఫ్లోనూ చేరి పలు విద్యార్థి సమస్యలపై ఉద్యమించారు. క్రమంగా ఆయన ఎఐవైఎఫ్లోనూ చేరి యువజన సమస్యలపై నినదించారు. ఆ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ పోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు. ఎం.డి. మునీర్ 1979లో సింగరేణి ప్రాంతంలో జరిగిన పోలీసు కాల్పుల ఘటనలో కార్మికుల వైపు నిలబడ్డారు. 1980లో మందమర్రిలో జరిగిన భూస్వామి హత్య కేసులో జైలుకివెళ్ళిన ఆయన అనేక సవాళ్లను అధిగమించి 1985లో జైలునుండి విడుదలయ్యారు.
అనంతరం ఆయన విలేఖరిగా పాత్రికేయ ప్రస్థానాన్ని ఆరంభించారు. ఆయన ప్రత్యేకంగా జర్నలిజం కోర్సులు చదువకున్ననూ అనేక పత్రికలలో జర్నలిస్ట్గాను తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎం.డి. మునీర్ సింగరేణి కార్మికుడుగా క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. కోల్ బెల్ట్ ఏరియా లోని మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖని ప్రాంతాలలోని బొగ్గు గని కార్మికులను బానిసలుగా చూసే అధికారులపై ఆయన తిరగబడ్డారు. కార్మికులలో పోరాట చైతన్యాన్ని రగిలించారు. ఉద్యోగిగా ఉంటూ పత్రికలో పనిచేయరాదు అనే నిబంధన ఉన్న కారణంగా ఆయన సింగరేణిలో ఉద్యోగాన్ని సైతం ఎనిమిది సంవత్సరాల ముందుగానే తృణీకరించారు. తత్ఫలితంగా ఆయన తన ప్రవృత్తి అయిన పాత్రికేయ వృత్తిలో చేరారు. ప్రజాసమస్యలపై ఆయన రాజీలేని కథనాలు రాసి అశేష ప్రజానీకం మద్దతు చూరగొన్నారు. కోల్ బెల్ట్ ప్రాంతాలలో అధికార పార్టీలకు ఊతమిచ్చే పత్రికలు కొనసాగుతున్న ఆ కాలంలోనే ఆయన ప్రజాపక్షం వైపు నిలిచి ‘ప్రజాపాత్రికేయుడు’గా వెలుగొందారు.
పాత్రికేయరంగంలో మేరు శిఖరంగా ఎదిగిన ఎం.డి. మునీర్ అనేక దినపత్రికలలో సామాజిక, రాజకీయార్థిక అంశాలపై పలు వ్యాసాలను ప్రజాకోణంలో ఆవిష్కరించారు. ఆయన దాదాపు అనేక పత్రికలలోనూ పాత్రికేయుడిగా నిరుపమాన సేవలు అందించారు. ఎం.డి. మునీర్ నాలుగు దశాబ్దాలపాటు జర్నలిస్ట్గాను నిబద్ధతతో పనిచేసి పాత్రికేయ రంగంలో తనకంటూ ఎన్నటికీ చెదిరిపోని విశిష్టమైన స్థానాన్ని పదిలపరచుకున్నారు. ఏదిఏమైననూ ఎం.డి. మునీర్ మచ్చలేని ప్రజాపాత్రికేయుడుగా నిలిచి పాత్రికేయ రంగానికి గొప్ప ఖ్యాతిని తీసుకు వచ్చారు అని సగర్వంగా చెప్పవచ్చు. ప్రముఖ పౌర హక్కుల యోధుడు కె. బాలగోపాల్ తదితరులతో నిజనిర్ధారణలకు వెళ్ళి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడంలో ఎం.డి. మునీర్ ప్రముఖంగా ఉద్యమించారు. స్వరాష్ట్ర సాధనకోసం సింగరేణి సకలజనుల సమ్మెకు ఎం.డి. మునీర్ కన్వీనర్ గాను నాయకత్వం వహించి ముందుండి ఉద్యమించారు. మంచిర్యాల ప్రెస్క్లబ్ అధ్యక్షుడు, టియుడబ్లుజె యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగాను ఎం.డి. మునీర్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు.
అంతిమంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారాల కోసం మునీర్ అవిశ్రాంతంగా ఉద్యమించారు. ఒక రకంగా ప్రశ్నించే తత్వం ఆయనను గొప్ప పోరాటయోధునిగా నిలిపింది అని నిర్దిష్టంగా చెప్పవచ్చు. అనారోగ్యం దరిచేరి తీవ్రంగా బాధిస్తున్ననూ తనను నమ్ముకున్న ప్రజానీకం కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎం.డి. మునీర్ ఎక్కడా రాజీపడకుండా తుది శ్వాస వరకు సమాజ హితమే లక్ష్యంగా భిన్నమైన వృత్తి రూపాలలో ఉద్యమించారు. పత్రికా రచనలో నూతన ఒరవడిని కొనసాగించి అంతిమంగా ఆయన పత్రికా రంగంలో సరికొత్త చరిత్రని సృష్టించారు. నైతికతకు ప్రాధాన్యం ఇచ్చి నీతి-నిజాయితీలకు ప్రతిరూపంగా జీవించి భావితరాలకు గొప్ప దార్శనికుడుగా నిలిచిన ఎం.డి. మునీర్ ఈ నెల 25నాడు అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణం కష్టజీవులకు ముఖ్యంగా కార్మిక, పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఏదిఏమైననూ ఆయన ప్రజాహృదయాలలో ఎన్నటికీ చెరగని వేగుచుక్కలా వెలుగొందుతూనే ఉంటారు.
- జె.జె.సి.పి. బాబూరావు, 93933 19690