నైరుతి పవనాలు వేగంగా ప్రవేశించడం ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువగానే వర్షపాతం ఉంటుందని, వ్యవసాయ రంగానికి అధిక ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నారు. అయితే వ్యవసాయ దిగుబడులు ఒక్క రుతుపవనాలపైనే కాకుండా అనేక అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. వాతావరణ పోకడలో మార్పులు సుదీర్ఘకాల సవాళ్లకు దారితీయవచ్చు. అయితే ఈ సందర్భంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నెలవారీ బులెటిన్లో వెలువడిన పరిశోధన నివేదిక వాతావరణ క్రమ రాహిత్యాలు సాధారణ స్థాయిల నుంచి వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో ఎలా విచలనం కలిగిస్తాయో వెల్లడించింది. వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా కూరగాయల సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. 2014 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు లభించిన డేటా ఉపయోగించి ఆహార ధరల్లో నిలకడ ఉండదని, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ఫలితంగా సరఫరా అస్తవ్యస్తంతో కూరగాయల ధరలు బాగా పెరిగిపోతాయని పేర్కొంది. వర్షపాతం మార్పుల కన్నా ఉష్ణోగ్రతల మార్పులే తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
వాస్తవ అంచనా ప్రకారం ఒక యూనిట్ ఉష్ణోగ్రత పెరిగితే వెజిటబుల్ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ) 1.3% వంతున నెలనెలా పెరిగిపోతుంది. అలాగే వర్షపాతంలో ఒక యూనిట్ పెరిగితే సిపిఐ 1.24 శాతం పెరిగిపోతుంది. 2022 నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉష్ణోగ్రత విఘాతాలు పంటలు పెరిగే కీలక సమయాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులు అంతగా నిల్వ ఉండని ఆహార పంటలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించాయని ఈ ఏడాది ఎకనామిక్ సర్వే కూడా స్పష్టం చేసింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలకు భిన్నంగా కూరగాయల దిగుబడుల కాలం తక్కువగా ఉంటుంది.
అకస్మాత్తుగా వాతావరణంలో తేడాలు కనిపిస్తే అత్యంత దుర్బల పరిస్థితిని ఎదుర్కొంటాయి. వడగాడ్పులు పెరిగితే అత్యధిక ఉష్ణోగ్రతలతో పంటలకు నీటి ఒత్తిడి పెరిగి దిగుబడులు తగ్గుతాయి. ఈలోగా అకాల వర్షాలు, వరదలు, కోతకు వచ్చే పంటలకు విపరీత నష్టాన్ని కలిగిస్తాయి. సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఎదురై పంటలకు విపరీత నష్టాలు సంభవిస్తుంటాయి. కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్కు సంబంధించి ఆహార ఉప పంటలలో కూరగాయల అధిక ధరలు తక్షణం ద్రవ్యోల్బణం అధికస్థాయిలో పెరిగిపోడానికి దారితీస్తుంది. ఉదాహరణకు ఎల్నినో సంవత్సరంగా గుర్తింపబడిన 202324 లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై అస్థిర వర్షపాతం సంభవించింది. దాంతో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కూరగాయాల దిగుబడి బాగా తగ్గిపోయింది.
అత్యంత అవసరాలైన టొమాటో, ఉల్లి, వెల్లుల్లి ధరల్లో అధిక ద్రవ్యోల్బణం కనిపించింది. పండ్ల దిగుబడి బాగా ఉన్నా తోటల ఉత్పత్తులపై ఈ ప్రభావం పడింది. ప్రపంచం మొత్తంమీద కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో భారత్ రెండోస్థానం వహిస్తోంది. గత కొన్నేళ్లుగా ఉద్యానవనాలు, తోటల దిగుబడులు నిదానంగా పెరుగుతున్నాయి. అయితే వాతావరణ మార్పులతో అకస్మాత్తుగా ఉత్పత్తి దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ఇది చివరకు వినియోగదారులను ఆశాభంగం కలిగించడమే కాక, ముఖ్యంగా చిన్నతరహా, సామాన్య రైతుల ఆదాయం కూడా తగ్గిపోతోంది. అసమాన ప్రకృతి స్వభావం వల్లనే ధరల్లో నిలకడ లేకుండా పోతోంది. పరిస్థితులు సాధారణమైనా ధరలు తగ్గడం లేదు. విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు, పంట తర్వాత అధిక నష్టాలు, కోల్డ్ స్టోరేజి సామర్థం తగినంతగా లేకపోవడం ఈ దుర్బలత్వానికి కారణమని చెప్పవచ్చు.
అందువల్ల ఈ సమస్యల పరిష్కారానికి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే పంట రకాలను స్వీకరించవలసి ఉంది. అలాగే అత్యధిక వేడిని, కరువును తట్టుకునే కూరగాయల రకాలను విస్తరింప చేయాలి. ఈ మేరకు అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ సహకారం తీసుకోవాలి. తెగుళ్లను తట్టుకునే, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలబడగలిగే అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాల విత్తనాలపై జాతీయ మిషన్ పరిశోధనలు సాగిస్తోంది. దీనివల్ల ఆహార భద్రత లభిస్తుంది.ఈ జాతీయ మిషన్ కోసం 202526 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అత్యధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతులు స్వీకరించడం ఎంతో అవసరం. దీంతోపాటు మార్కెట్ అనుసంధానం, రవాణా, నిల్వకు తగిన గిడ్డంగులు, డిజిటల్ ప్లాట్ఫారమ్స్ ఇవన్నీ విస్తృతం చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో సేద్యంలో ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ వంటి దేశాలు అత్యంత ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నాయి.
ఈ దేశాలు అనుసరిస్తున్న గ్రీన్హౌస్ కూరగాయల సాగును అమలు చేస్తున్నాయి. ఇటువంటి అత్యంత ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. గ్రీన్హౌస్ అనేది పండ్లు, కూరగాయలకు రక్షణ కల్పించే గాజు లేదా ప్లాస్టిక్తో కూడిన అపారదర్శక బాహ్యకవచం. ఇది మొక్కల పెరుగుదలకు దోహదం చేసే, పర్యావరణ ప్రమాదాలనైనా నియంత్రిం చే రక్షిత ప్రదేశం. క్రిమికీటకాల నుండి, తెగుళ్ల నుండి ఈ గ్రీన్ హౌస్ పద్ధతిలో రక్షణ లభిస్తుంది. అలాగే భారీ వర్షాల నుండి, పెనుగాలుల నుండి కవచంలా గ్రీన్హౌస్ సీలింగ్ కాపాడుతుంది. ఇటువంటి ఆధునిక విధానాల వల్ల వాతావరణ ప్రతికూలతలు తేలికవుతాయి. ఏడాది పొడుగునా నికరమైన దిగుబడులు వస్తాయి. చివరకు ధరలు నిలకడగా ఉండి వినియోగదారుల సంక్షేమంతోపాటు రైతుల ఆదాయానికి కూడా భద్రత లభిస్తుంది. వ్యవసాయం లాభసాటిగా సాగాలంటే గ్రీన్హౌస్, హైడ్రోపోనిక్, ఆక్వాపోనిక్ వ్యవసాయం వంటి ఆధునిక పద్ధతులను మనదేశంలో అవలంబించడం ఎంతైనా అవసరం.