ముల్లాన్పూర్: ఐపిఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్స్కు చేరింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్లో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సిబి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ (Virat Kohli) ఓ యువ క్రికెటర్తో స్లెడ్జింగ్ (Sledging) చేయడంతో అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, ఆర్సిబి బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. జట్టు బలహీనంగా ఉన్న క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ను బరిలోకి దింపారు. అయితే ఆ సమయంలో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ (Virat Kohli) అతనితో స్లెడ్జింగ్ (Sledging) చేశాడు. ‘యే తో పానీ పిలాతా హే (ఇతడు నీళ్లు అందిస్తాడు)’ అని అన్నాడు. కొన్ని ఓవర్లకు ముందే ముషీర్ ఖాన్ ఆటగాళ్లకు నీళ్లు అందించాడు. దీంతో కోహ్లీ అలా అన్నాడు.
అయితే స్టార్ క్రికెటర్ అయిన కోహ్లీ ఓ యువ ఆటగాడిని ప్రోత్సహించాలి కానీ.. ఇలా కించపరడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కోహ్లీ స్థాయికి ఇది తగదు అని కామెంట్లు చేస్తున్నారు. అయితే కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం అతడిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ముషీర్ ఖాన్కు కోహ్లీ ఆరాధ్య క్రికెటర్ అని.. సీజన్ ఆరంభంలో కోహ్లీ తన బ్యాట్ని ముషీర్కి బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక అన్నలా తమ్ముడిలాంటి ముషీర్ను ఆటపట్టించాడని కామెంట్స్ చేస్తున్నారు.