దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి.వారికి ఉపశమనం కలిగించేలా 19 కిలోల LPG గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. సిలిండర్ ధరపై రూ.24 తగ్గిస్తున్నట్లు ఆదివారం ప్రకటించాయి. ఈరోజు(జూన్ 1) నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపాయి. దీంతో 19 కిలోల LPG సిలిండర్లను ఎక్కువగా ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. తాజా తగ్గింపుతో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ ధర ఇప్పుడు రూ.1,723.50కు చేరుకుంది. ప్రధాన నగరాలైన ఢిల్లీలో రూ.1,723.50, కోల్కతాలో రూ.1,826, ముంబైలో రూ.1,674.50, చెన్నైలో రూ.1,881గా ఉన్నాయి.
వాణిజ్య LPG ధరలలో వరుసగా మూడవ నెలవారీ తగ్గింపు ఇది. మే ప్రారంభంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ.14.50 తగ్గించాయి. దీనికి ముందు, ఏప్రిల్ 1న, సిలిండర్ ధరలను రూ.41 తగ్గించారు. అయితే, గృహ LPG సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. మార్చిలో, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశీయ LPG సిలిండర్ల ధరను రూ.50 పెంచింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనల తరువాత ప్రపంచ ముడి చమురు ధరలు పెరగడం దీనికి కారణమని పేర్కొంది.