బిఆర్ఎస్ హయాంలోని తెలంగాణ సక్సెస్ స్టోరీని
ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతంగా వివరించిన కెటిఆర్
లండన్ నుంచి అమెరికా డల్లాస్కి పయనం
డల్లాస్లో కెటిఆర్కు ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు యుకె పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ విజయగాథను కెటిఆర్ అద్భుతంగా వినిపించారు. అధికారం కంటే పుట్టిన గడ్డ మీదనే తనకు మమకారం ఉంటుందని ఈ పర్యటనలో సమున్నతంగా చాటారు. ఈ నెల 27న యుకెలో అడుగుపెట్టిన కెటిఆర్కు స్వాగతం పలకడానికి తెలంగాణ ఎన్.ఆర్.ఐలు భారీగా తరలివచ్చారు. కెటిఆర్ మాస్కులు ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత ఆపరేషన్ తరువాత కోలుకుంటున్న బిఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ నాయకుడు, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ అనిల్ ఇంటికి ఎయిర్ పోర్ట్ నుంచే నేరుగా వెళ్లి కెటిఆర్ ఆయనను పరామర్శించారు.
మలిదశ ఉద్యమంలో దశాబ్దకాలం కాలం పాటు ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణవాదాన్ని వినిపించిన అనిల్ను ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 28 తేదీన బిఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ కార్యవర్గం, సీనియర్ నేతలతో లండన్లో సమావేశమైన కెటిఆర్, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాల పైన చర్చించారు. 30వ తారీఖున బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో ప్రధాన ఉపన్యాసం ఇచ్చిన కెటిఆర్,ఆర్థిక రంగాన్ని స్థిరమైన వృద్ధితో నడిపించడంలో ప్రపంచానికి తెలంగాణ ఎలా దిక్సూచీగా మారిందో అద్భుతంగా వివరించారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ సంస్థలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే పిడిఎస్ఎల్ సంస్థ నాలెడ్జ్ సెంటర్ను వార్విక్ యూనివర్సిటీలో మే 31 నాడు కెటిఆర్ ప్రారంభించారు. యుకె పర్యటన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
డలాస్లో కెటిఆర్కు ఘనస్వాగతం
యుకె పర్యటన ముగించుకొని అమెరికాలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు కెటిఆర్ యుకె నుంచి అమెరికాలోని డల్లాస్కి బయలుదేరి వెళ్లారు. డాలస్కు చేరుకున్న కెటిఆర్కు బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఎ విభాగం ప్రతినిధులతో తెలంగాణ ఎన్ఆర్ఐలు, పార్టీ ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.