బెంగాల్ బిజెపి భేటీలో అమిత్ షా
కోల్కతా : మమత బెనర్జీ యధావిధిగా మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు ఆపరేషన్ సిందూర్ను అదే పనిగా వ్యతిరేకిస్తున్నారని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. దేశ భద్రత విషయం అయిన సిందూర్పై కూడా మమత తన వైఖరిని చాటుకుని దిగజారారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఇక్కడ బిజెపి నేతలు, కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. రాష్ట్ర బిజెపి ఏర్పాటు చేసిన ఈ సభలో వారికి కర్తవ్య బోధ చేశారు. మమత ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంక్ల కోసం పాటుపడుతుంది. ఇందుకు ఎంతకైనా తెగిస్తుంది.
ముర్షీదాబాద్లో ఇటీవలి ఘర్షణలు పూర్తిగా ఇక్కడి టిఎంసి రాష్ట్ర ప్రభుత్వ ప్రేరణతో సాగినవే అని ఆరోపించారు. వచ్చే ఏడాది ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి పూర్తి స్థాయిలో సమాయత్తం కావల్సి ఉంది. టిఎంసి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చూడాల్సి ఉంది. ఇందుకు పార్టీ వర్గాలు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రెండు రోజుల క్రితమే ప్రధాని మోడీ బెంగాల్లో పర్యటించి వెళ్లారు. మమత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ ఎన్నికల్లో ఆపరేషన్ బెంగాల్ వంటిది జరగాల్సిందే అని వ్యాఖ్యానించి వెళ్లారు. ఆపరేషన్ సిందూర్పై మమతకు , కేంద్రానికి మధ్య తీవ్రస్థాయి వివాదం సాగుతోంది. మోడీ ప్రభుత్వం రాజకీయ లబ్ధికే ఈ ఆపరేషన్కు దిగిందని, వాస్తవాలు కప్పిపుచ్చిందని మమత బెనర్జీ ఆరోపిస్తూ వచ్చారు.