న్యూఢిల్లీ : నైరుతిపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో దాదాపు 34 మంది మరణించారు. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. సిక్కిం లోని ఛటేన్లో మిలటరీ క్యాంపుపై కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, ఆరుగురి జాడ గల్లంతయింది. ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీగా వర్షాలు కురియడంతో ఈ సంఘటన జరిగిందని రక్షణశాఖ అధికారి ఒకరు సోమవారం ప్రకటించారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఇంతవరకు మూడు మృతదేహాలను వెలికి తీశామని ఆయన పేర్కొన్నారు.
నలుగురికి స్వల్పగాయాలైనట్టు చెప్పారు. గల్లంతైన ఆరుగురి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. సిక్కింలో తీస్తానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నార్త్ సిక్కిం లోని తీంగ్, చుంగ్తాంగ్లో కొండచరియలు విరిగిపడటంతో అనేక రోడ్లు మూసివేశారు. అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయాల్లో జూన్ 4 వరకు ఉరుములు, మెరుపులు భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసోం లోని పలు ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో 20 కి పైగా జిల్లాలో వరద నీటితో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. లఖింపూర్లో 41,000 మంది నిర్వాసితులు కాగా, అస్సాంలో మొత్తం 78,000 మంది నిర్వాసితులయ్యారు.
మిజోరం, త్రిపుర, మేఘాలయల్లో కొండచరియలకు 8 మంది మృతి చెందారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ వరద నీటిలో మునిగింది. ఇంఫాల్ నదీ పరీవాహక లోతట్టు ప్రాంతాల నుంచి నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో వరద నీటికి ఒక కారు కొట్టుకుపోయింది. ఏడుగురు చనిపోయారు. మరో సంఘటనలో ఇద్దరు వరద నీటిలో మునిగిపోయారు.
నైరుతి పవనాలు రావడంతో ప్రపంచం లోనే అత్యధిక వర్షపాతం అరుణాచల్ ప్రదేశ్లో నమోదైనట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం నుంచి సంపూర్ణ సహాయక చర్యలు అందిస్తామని భరోసా కల్పించారు.