Friday, June 20, 2025

పాలనలో లోపాలను కవులు ఎత్తిచూపాలి

- Advertisement -
- Advertisement -

యువ కవుల రచనలతో తెలంగాణ సాహిత్యం
వందల ఏళ్లు నిలిచి ఉంటుంది
యువ కెరటాలు కవి సమ్మేళనంలో
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,
ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : కవులు, సాహితీవేత్తలు పాలనలో లోపాలను ఎత్తిచూపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ గడ్డలోనే ధిక్కారం ఉంటుందని.. అదే స్థాయిలో ప్రేమ కూడా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో సోమవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటేనే తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, వైభవం, విశిష్టత వందల ఏళ్లు నిలిచి ఉంటుందని తెలంగాణ జాగృతి పని చేసిందని గుర్తు చేశారు.

యువ కవుల రచనలతో తెలంగాణ సాహిత్యం వందల ఏళ్లు వర్ధిల్లుతుందని యువ కవి సమ్మేళనం అన్ని భాషల్లో నిర్వహించామని పేర్కొన్నారు. 35 ఏళ్లలోపు కవులు ఈ సమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేశారని తెలిపారు. కెసిఆర్ దిక్సూచీలా, దారిదీపంలా నిలబడి ఉద్యమ దిశానిర్దేశం చేశారని.. ఆయన సాగించిన పోరాటాలు, వందలాది మంది త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు ఈ రోజు అని పేర్కొన్నారు. కవులు ఏ పాలకుడి ముందు తలవంచకూడదని.. పాలనలో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలన్నారు. పాలకుడి స్థానంలో ఎవరున్నా కవులు, సాహితీవేత్తలు ఈ పని చేయాలని సూచించారు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే కవి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించిన పోరాటం, అమరుల త్యాగాలు, ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో దగా పడిన వైనాన్ని కవులు, సాహితీవేత్తలు అద్భుతంగా చెప్పారని గుర్తు చేశారు. రేపటి తెలంగాణ అభివృద్ధి, వికాసం కోసం సాహిత్య సృజన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వనరులను పరిరక్షించుకోవాలన్నా, నీళ్లు.. నిధులు హక్కులు కాపాడుకోవాలన్నా అందుకు కవులు, సాహితీవేత్తల సహకారం అవసరం అన్నారు. ఈ అంశాలపై తెలంగాణ జాగృతి చేపట్టబోయే కార్యక్రమాలకు చేయూతనందించాలని కోరారు.

బలమూరి కొండలరాయుడు గేయ కావ్యం ఆవిష్కరణ

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం యువ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించాలని తలపెట్టి రద్దు చేసుకుందని ఎంఎల్‌సి కవిత అన్నారు. తెలంగాణతో సంబంధం లేని రాజీవ్ గాంధీతో పేరుతో కాకుండా తెలంగాణ ఉద్యమకారుల పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. అర్హుల ఎంపికలో లోపాలున్నాయని కార్యక్రమ ప్రారంభాన్ని వాయిదా వేసుకున్న ప్రభుత్వం పథకానికి తెలంగాణ ఉద్యమకారుల పేరు పెట్టేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి బివిఆర్ చారి పుట్టిన రోజు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.

సాహిత్యం, సంస్కృతి వర్ధిల్లిన నేలనే కలకాలం నిలిచి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కంచనపల్లి గోవర్ధన రాజు రచించిన బలమూరి కొండలరాయుడు గేయ కావ్యాన్ని ఎంఎల్‌సి కవిత ఆవిష్కరించారు. ఆయన సాగిస్తున్న సాహిత్య కృషి ప్రశంసించారు. ఈ కావ్యంతో కాంచనపల్లి భిన్న ప్రక్రియలు సృష్టించగలరని తెలంగాణ సాహితీలోకం అర్థం చేసుకుందన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాన్ని పొందినందుకు ఆయనను అభినందించారు.

జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సుదీర్ఘ పోరాటం, వందలాది మంది బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అని నినదించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, జాగృతి కొత్త కార్యాలయంలో జెండా ఆవిష్కరణ తనకెంతో గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాలు, వారి తల్లుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. కెసిఆర్ దృఢ సంకల్పం, దూరదృష్టితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసుకున్న అమరవీరులకు కనీసం సరైన నివాళులు కూడా అర్పించని ప్రభుత్వం ప్రస్తుతం ఉండటం దురదృష్టకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News