Friday, June 6, 2025

మాకు తెలంగాణే ఫస్ట్

- Advertisement -
- Advertisement -

 అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో
ఉన్నా అదే మా ప్రాధాన్యం
పదేళ్లలో రాష్ట్రాన్ని మోస్ట్ సక్సెస్‌ఫుల్
స్టార్టప్ స్టేట్‌గా తీర్చిదిద్దాం
స్వతంత్ర భారతదేశ చరిత్రలో
ఇంతటి ఘనత సాధించిన ఏకైక
రాష్ట్రం తెలంగాణే మళ్లీ
మూడేళ్లలో తిరిగి అధికారంలోకి
వస్తాం కెసిఆరే సిఎం డల్లాస్‌లో
జరిగిన రాష్ట్ర ఆవిర్భావ
దినోత్సవంలో బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : 14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమ రథసారథి కెసిఆర్ పాలనలో కేవలం పదేళ్ల వ్యవధిలోనే దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఎదిగిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని, ఇంత అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణను అద్భుత అవకాశాల అక్షయపాత్రగా, ఇండియాకే ఎకనామిక్ ఇంజన్‌గా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికీ కెసిఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు.

అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న డాక్టర్ పెప్పర్ ఎరీనాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బిఆర్‌ఎస్ రజతోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జననీ జన్మభూమిఛ్చా స్వర్గాదపీ గరీయసీ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన కెటిఆర్, కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి.. కానీ జన్మభూమి రుణం కూడా తీర్చుకోవాలని ఎన్.ఆర్.ఐలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తెలంగాణ రాష్ట్రం దేశానికి చాటిచెప్పిందని సగర్వంగా ప్రకటించారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, 10 ఏళ్ల తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో, అడుగడుగునా కెసిఆర్ వేసిన చారిత్రక ముద్రను అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎన్.ఆర్.ఐ.ల హర్షధ్వానాల మధ్య కెటిఆర్ వివరించారు.

సమైక్యపాలకుల వివక్షతో దశాబ్దాలపాటు పడావుబడ్డ తెలంగాణ దీనస్థితిని, కెసిఆర్ హయాంలో పదేళ్లలోనే సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా ఎదిగిన తీరును కెటిఆర్ అద్భుతంగా ఆవిష్కరించారు. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డమీద ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఇవాళ డల్లాస్‌లో కూడా అదే జోష్ కనిపిస్తుందని కెటిఆర్ అన్నారు. ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. అమెరికాలో లీగల్ సెల్ ఏర్పాటు చేసి తెలుగు విద్యార్థులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కెసిఆర్

అభివృద్ధి, ఆత్మ గౌరవం, తెలంగాణ అస్తిత్వ లక్ష్యాల సాధన కోసం 20 సంవత్సరాల క్రితం ఒక స్వప్నం చిగురించిందని, తెలంగాణ ప్రజల పోరాటాలతోనే చరిత్ర సృష్టించబడిందని వ్యాఖ్యానించారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు కాదు, మూడు రాష్ట్రాలు ఉన్నాయని టెక్సాస్‌ను చూస్తే అనిపిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2015లో పెట్టుబడుల కోసం డల్లాస్ నగరానికి వచ్చానని, ఆనాడు ఆత్మవిశ్వాసంతో.. భవిష్యత్తు మీద నమ్మకంతో.. తెలంగాణ తరఫున కెసిఆర్ దూతలుగా తాము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చడంతో పాటు చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపించినందుకు గర్వంగా అనిపిస్తుందని అన్నారు.

దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తితో, బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తిగా, ఐ హేవ్ ఏ డ్రీమ్ అని గర్జించిన మార్టీన్ లూథర్ కింగ్ స్పూర్తిగా చిమ్మచీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒకే ఒక నాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు. శూన్యం నుంచి సునామి సృష్టించి, తెలంగాణ మిషన్ ఇంపాజిబుల్ అన్న పరిస్థితిని మిషన్ పాజిబుల్ అన్న పరిస్థితికి తెచ్చి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కెసిఆర్ అని చెప్పారు. అమెరికా గడ్డపై కూడా ఎన్నారైలు.. మాతృభూమి కోసం జై తెలంగాణ అని నినదించి తమ పోరాట స్ఫూర్తిని ఘనంగా చాటారని అన్నారు.

కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి, అవమానాలను అధిగమించి అవరోధాలను కూకటి వేళ్ళతో పెకిలించి ఉద్యమ రథసారథి కెసిఆర్ నాయకత్వంలో జరిగిన ఈ సుదీర్ఘ ప్రయాణం దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన రాజకీయ అధ్యాయమని తెలిపారు. మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం.. తిరిగి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే రాష్ట్రం 12వ ఏట అడుగు పెట్టిందని చెప్పారు. 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ గర్వించే కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకుందని, తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు పాతికేళ్లు నిండాయని తెలిపారు. స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబ్లీ జరుగుతుందని అన్నారు.

ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుంది

ఏ దేశమేగినా.. ఏ పీటమెక్కినా.. పుట్టిన గడ్డ పేరు వినగానే ఎవరికైనా పులకింత కలుగుతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. డల్లాస్‌లో జై తెలంగాణ అని అందరూ నినదించినప్పుడు గుండెలనిండా మన ఆత్మగౌరవం ఆకాశమే హద్దుగా ఉప్పొంగిందని అన్నారు. మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి వందనం… అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. పదేళ్లపాటు ప్రభుత్వం లో ఉన్నప్పుడు దాన్ని బరువులా భావించలేదు… బాధ్యతలా భావించామని చెప్పారు.విడిపోతే విఫల రాష్ట్రం అవుతుందని హేళన చేసిన చోటనే విజయకేతనం ఎగరవేశామని తెలిపారు. స్వరాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా కెసిఆర్ నాయకత్వంలో వదులుకోలేదని పేర్కొన్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఓట్లల్లో వెనుకబడ్డాం కావచ్చు కానీ తెలంగాణను ప్రేమించడంలో ఎన్నటికీ వెనుకబడమని చెప్పారు. పొజిషన్‌లో ఉన్నా అపోజిషన్‌లో ఉన్నా కచ్చితంగా తమకు తెలంగాణనే ఫస్ట్.. ఇండియానే ఫస్ట్ అని పునరుద్ఘాటించారు. అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుందని చెప్పారు. తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు అంటూ ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎన్నారై అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు.. నెసెసరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని, తెలంగాణ ఠీవి పివి నరసింహారావు భారతదేశ ముఖచిత్రాన్ని మార్చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.

కెసిఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా

కెసిఆర్ మాట ఇస్తే నెరవేర్చి తీరుతారన్న అచెంచెల విశ్వాసం తెలంగాణ ప్రజలది అని కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా అని వ్యాఖ్యానించారు. ఆయన నినాదం ఇస్తే అది సంచలనం.. ఆయన విధానాన్ని ప్రకటిస్తే అదొక విప్లవం అని చెప్పారు. ఉద్యమదారి వదిలేస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పినా.. కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రకటించినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ పోతున్నా తిరిగి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వస్తానని చెప్పినా అది కెసిఆర్ ఆత్మవిశ్వాసానికి, ప్రజల మీద ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం అని పేర్కొన్నారు. విప్లవాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులతో కెసిఆర్ తెలంగాణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చారని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజ్‌లు, 19 రిజర్వాయర్లు, 21 పంపు హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 141 టిఎంసిల స్టోరేజ్ కెపాసిటీ సమాహారం కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు. 371 పిల్లర్లు ఉండే మూడు బరాజుల్లో రెండు పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయింది, వృధా అయిందని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషప్రచారం ఆపాలని, ఈ జల అక్షయపాత్రను సద్వినియోగం చేసుకోండి అని తెలంగాణ రైతుల తరపున అడుగుతున్నామన అన్నారు.

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరధి అంటే, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అని కెసిఆర్ అన్నారని చెప్పారు. తెలంగాణకు మాత్రమే కాదు భారతదేశానికే హైదరాబాద్ గుండెకాయ లాంటిది. అల్లర్లు, అలజడలు లేకుండా ఒక ప్రశాంత వాతావరణం, అద్భుతమైన శాంతిభద్రతలు ఉండాలని 10 లక్షల సిసి కెమెరాలు పెట్టి హైదరాబాద్ ను లివబుల్ లవబుల్, మోస్ట్ లవబుల్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దాం. కేంద్ర ఒక్క మెడికల్ కాలేజీ , ఒక్క నర్సింగ్ కాలేజీ ఇవ్వకున్నా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజ్ పెట్టుకున్నామని అన్నారు. 20 లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌తో ఎనిమిది వేల మంది పిల్లలను కెసిఆర్ ప్రభుత్వం విదేశాల్లో చదివించిందని తెలిపారు.

అమెరికా విద్యార్థులకు అండగా ఉంటాం

అమెరికాలో మన విద్యార్థులకు వస్తున్న ఇబ్బందులను తొలగించడానికి బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని కెటిఆర్ చెప్పారు. లీగల్ సెల్ ఏర్పాటు చేసి మన విద్యార్థులకు అండగా నిలబడతామని కెసిఆర్ దూతగా మీకు మాట ఇస్తున్నానని ఎన్‌ఆర్‌ఐలకు భరోసా ఇచ్చారు. విజ్ఞాన ఆధారిత సమాజాలే ప్రపంచంలో అగ్రగాములుగా ఉన్నాయని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మార్పు అనివార్యం..ఆ మార్పుకు మనం అలవాటు పడాలి, అప్పుడే మనం నిలబడగలుగుతాము జయం మనదే.. జై తెలంగాణ అని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News