నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్ మీద రూపేశ్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. (Shashtipurthi) పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా విడుదలై థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కల్చరల్ బ్లాక్బస్టర్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “షష్టిపూర్తి’ అనేది కల్చరల్ బ్లాక్బస్టర్ కాదు.. కల్ట్ బ్లాక్బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ నాకు దక్కింది. మీడియా, ఆడియెన్స్ వల్లే మా ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ స్థాయి వరకు వచ్చింది. థియేటర్లో అందరూ చూసి ఏడ్చేస్తున్నారంటేనే మేం సక్సెస్ అయినట్టు. ‘లేడీస్ టైలర్’లో నేను చాలా అల్లరి చేశాను. ‘ఆ నలుగురు’ చూసి నన్ను రఘురాం అని అన్నారు. అదే పాత్ర తాలుకా గొప్పదనం. మన కంటే మన పాత్రలే గుర్తుంటాయి అని ఎన్టీ రామారావు చెబుతుంటారు.
పవన్ ప్రభ నా మీద కథ రాసుకున్నారు. ‘లేడీస్ టైలర్’ తరువాత అర్చనను మళ్లీ ఇంత వరకు చూడలేదు. మాతో ఇలాంటి ఓ గొప్ప కథను, సినిమాను పవన్ ప్రభ చెప్పారు. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు” అని అన్నారు. హీరో, నిర్మాత రూపేశ్ మాట్లాడుతూ .. “ఈ మూవీని థియేటర్లలో ( movie in theaters) చూస్తేనే మంచి ఫీలింగ్ వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్, తోట తరణి సెట్స్ను బిగ్ స్క్రీన్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. కొత్త వారు చేసిన పాత్రల్ని కూడా ఆడియెన్స్ గుర్తు పెట్టుకుంటున్నారు. ఫ్యామిలీతో ఈ సినిమాను అందరూ చూడండి”అని తెలిపారు. దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ .. “కుటుంబ విలువలు, ప్రేమ అనేది ప్రతీ ఒక్కరిలో ఉంటాయి. వాటినే నమ్ముకుని ఈ సినిమాను తీశాను. ఇది తల్లిదండ్రులతో పాటుగా ఓ కొడుకు కథ. మా సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్యప్రసాద్, రామ్ పాల్గొన్నారు.