రాష్ట్రంలో సగం కేబినెట్ కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఇటీవల కాలంలో ఐక్యతారాగాన్ని ఆలపిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతున్నది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తోపాటు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఖమ్మం జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటం, అంతేగాక వీరు నిర్వర్తించే శాఖలు కీలకమైనవి కావడంతో హైదరాబాద్ సచివాలయం సర్కిల్లో ఖమ్మం జిల్లా అంటే ‘మినీ కేబినెట్’గా పిలుచుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ ముగ్గురు కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా వారి మధ్య సమన్వయం లేదని పొలిటికల్ సర్కిల్లో గత కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అయితే దానిని చెక్ పెట్టేందుకు ఈ ముగ్గురు మంత్రులు ఇటీవల కాలంలో ప్రయత్నించడం పార్టీ శ్రేణులు శుభపరిణామంగా పేర్కొంటున్నారు. దాదాపు ఏడాది తరువాత ముగ్గురు కలిసి తరచుగా ఒక వేదికను పంచుకున్న దృశ్యాలు కాంగ్రెస్ కార్యకర్తలకు నయనానందకరంగా మారాయి.
ఎఐసిసి రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఎంఎల్ఎలతో ఆమె విడివిడిగా, వ్యక్తిగతంగా మాట్లాడారు. ఆమెకు ఉన్న ఫీడ్ బ్యాక్తో ఎవరికి ఏమి చెప్పాలో అది చెప్పి పంపించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలన్నా అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆమె తనను కలిసిన వారందరికీ ఒకే మాటగా చెబుతున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు మంగళవారం డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిర నియోజకవర్గం ఎర్రుపాలేం మండలం ములుగుమాడు గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఒక వేదికపై దర్శనం ఇచ్చిన దృశ్యం కాంగ్రెస్ శ్రేణులకు మిక్కిలి సంతోషాన్ని కలిగించింది.
‘ముగ్గురు ఉంటే ముడిపడదు, నలుగురు ఉన్న చోట కర్ర విరగదు పాము చావదు’ అనే పాత సామెత ఎలా ఉన్నా గడిచిన ఏడాదిన్నర కాలంలో ముగ్గురు ఎవ్వరికివారే యమునా తీరు చందంగానే వ్యవహరిస్తున్నప్పటికీ అడపాదడపా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముగ్గురు కలిసి జిల్లాకు వచ్చి ఆనాడు ఐక్యత చాటారు. ఆ తరువాత ఎవ్వరికి వారే అన్నచందంగా వ్యవహరించారు. గతంలో పొంగులేటి, తుమ్మల కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్లో చేరిక కొత్తలో భట్టితో సమన్యయం కొంత ఆలస్యం అయింది. గతంలో జిల్లాకు చెందిన మంత్రులు ఎవరికి వారే తమ నియోజకవర్గాల్లో పర్యటించినప్పటికీ, ఇతర నియోజకవర్గాలకు వెళ్లినా ఎవరో ఒక్కరే వెళ్ళేవారు. అంతేగాక ఒకే అంశంపై ముగ్గురు మంత్రులు వేర్వేరుగా సమీక్షలు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఖమ్మం మున్నేరు వరదలు కావోచ్చు లేదా భద్రాచలంలో గోదావరి వరదలు కావోచ్చు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ముగ్గురు వేర్వేరుగా పర్యటించడం, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ఎవ్వరికి వారే అధికారులతో వేర్వేరుగా సమీక్షలు జరపడంతో పరోక్షంగా వీరి మధ్య అగాధం ఉందనే సాంకేతాలు బయటకి వెళ్ళసాగాయి. హైదరాబాద్లో జరిగే మంత్రివర్గ సమావేశాలు, ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాల్లో పలు సందర్భాలో కలిసి పాల్గొంటున్నప్పటికీ ఈ జిల్లాకు వచ్చేసరికి గడిచిన ఏడాదిన్నర కాలంలో ముగ్గురు మంత్రులు కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు అరుదు. ఉమ్మడి జిల్లా పర్యటనల్లోనూ ఈ ముగ్గురు మంత్రులు కలిసి పార్టీ కార్యక్రమాలకు హాజరైన సంఘటనలు కూడా చాలా తక్కువే. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభల్లో, ఉమ్మడి జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంలోనే ముగ్గురు మంత్రులు ఒక వేదికను పంచుకున్నారు.
భద్రాచలం పట్టణంలో జరిగిన ఇందిరమ్మ పథకం ప్రారంభం, వైరాలో జరిగిన సీతారామా ప్రాజెక్టు, వైరా లింక్ కెనాల్ ప్రారంభ సభలో, శ్రీరామ నవమి వేడుకల్లో, మున్నేరు వరదల సమయంలో మాత్రమే కలిసి పాల్గొన్నారు. మల్లు భట్టి మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండగా, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. ఆనాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవ్వరికి వారే తమ వంతు పాత్ర పోషించారు. వంద రోజుల పాటు మల్లు భట్టి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయగా, పొంగులేటి, తుమ్మల చేరికతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిందనేది నగ్నసత్యం. సీతారామా ప్రాజెక్టును పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేసి గోదావరి నీళ్ళను పాలేరుకు మళ్ళించే డిజైన్ ఉండగా మున్నేరు వరద నీటిని పాలేరుకు మళ్ళించేందుకు రూ. 102 కోట్లతో పాలేరు లింక్ కెనాల్ తేవడం, కల్లూరుని కొత్తగా మున్సిపాలిటీ చేయడంలో ఒక గ్రామాన్ని ఆ మున్సిపాలిటీలో విలీనం చేసే సందర్భంలో, సీతారామా ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగడానికి ఏర్పడ్డ అవరోధాల విషయంలో, జిల్లాకు చెందిన సుడా చైర్మన్, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించినప్పటికీ అది అంతర్గతంగానే కొనసాగింది.
ఎక్కడ కూడా బహిర్గతం కాలేదు. ఇప్పుడు ముగ్గురు మంత్రులకు జ్ఞానోదయం అయిందేమో గాని ప్రస్తుతం మాత్రం ముగ్గురు మంత్రులు కలిసి ఉంటే కలదు సుఖం అని భావించి ఐక్యత రాగాన్ని ఆలపిస్తున్నారు. ఇలా ముగ్గురూ కలిసి తరచుగా అభివృద్ధి, సంక్షేమ, అధికార కార్యక్రమాలనే కాదు, పార్టీ వేదికలను కూడా పంచుకుంటే క్రింది స్థాయిలో కూడా ఇదే విధంగా ఐక్యతను ప్రతిబింబిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మూడు కీలక శాఖలను నిర్వహిస్తున్న ముగ్గురు మొనగాళ్ళు, పదేపదే అభివృద్ధి జపం చేసేవాళ్ళు కలిసి నడిస్తే ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతుందనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ సఖ్యత తాత్కాలికమా? అనే దానికి వేచిచూడక తప్పుదు.
Khammam district ministers
Khammam district ministers
వనం వెంకటేశ్వర్లు,
(ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి)
(98489 97240)