భిక్షాటన చేసేందుకు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఓ జంట చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. చిన్నారి కిడ్నాప్ ఘటన బుధవారం చోటుచేసుకోగా పోలీసులు మూడు గంటల్లో కేసును ఛేదించారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఎఎస్పి చైతన్య రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. భిక్కనూరుకు చెందిన మక్కాల నర్సింలు భార్యాపిల్లలతో కామారెడ్డిలో భిక్షాటన చేస్తుంటాడు. రోజూ మాదిరిగానే మంగళవారం భిక్షాటన అనంతరం రాత్రి సిరిసిల్ల రోడ్డులో ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద నిద్రించారు. అర్ధరాత్రి లేచి చూసేసరికి తమ కుమారుడు హర్షిత్ కనిపించకపోయేసరికి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎఎస్పి ఆధ్వర్యంలో సిఐ, ఎస్ఐ మూడు బృందాలుగా సిసి కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఓ జంట ఆ బాలుడిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వారు కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద చిన్నారితో భిక్షాటన చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కిడ్నాప్ చేసిన జంట దోమకొండకు చెందిన పల్లపు రాజు, పల్లపు శారదగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. మూడు గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఎఎస్పి అభినందించారు. సమావేశంలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ శ్రీరాం, సిబ్బంది పాల్గొన్నారు.