నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సి) తీవ్రంగా స్పందించింది. ఈ దురదృష్టకర సంఘటనకు సంబంధించి మీడియాలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించిన కమిషన్, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోలీసుల వేధింపుల కారణంగానే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సి ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని ఆదేశించింది. ఈ నోటీసులకు రెండు వారాల్లోగా స్పందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సి స్పష్టం చేసింది. యువకుడి మృతికి దారితీసిన పరిస్థితులు, పోలీసులపై వచ్చిన ఆరోపణలపైన లోతైన విచారణ జరిపి, వాస్తవాలను నివేదించాలని కోరింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని టోలీచౌకికి చెందిన మహహ్మద్ ఇర్ఫాన్ (35) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇద్దరు భార్యలు.
ఈ క్రమంలో అతడు మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో విషయం తెలుసుకున్న రెండో భార్య నిలదీసింది. ఈ విషయంపై భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాగే మే 13న కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా అది ఎంతకీ తెగకపోవడంతో ఇరు వర్గాలు రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. ఈ క్రమంలో భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను లోపలికి తీసుకెళ్లిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఇర్ఫాన్ కుప్పకూలిపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అయితే పోలీసులు కొట్టడం వల్లే అతడు మరణించాడంటూ ఇర్ఫాన్ సోదరుడు ఆరోపించాడు. ఇర్ఫాన్ను తాము కొట్టలేదని పోలీసులు వెల్లడించారు. పోలీసుల టార్చర్ వల్లే యువకుడు మృతిచెందాడంటూ మీడియాలో కథనాలు రావడంతో ఈ ఘటనను ఎన్హెచ్ఆర్సి సుమోటోగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వానికి, డిజిపికి నోటీసులు జారీ చేసింది.