Saturday, June 7, 2025

కాళేశ్వరం కూలితే గంధమల్లకు గోదావరి జలాలు ఎట్లా వస్తాయి?:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం కూలి ఉంటే గంధమల్ల ప్రాజెక్టుకు గోదావరి జలాలు ఎట్లా వస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దుబ్బాకలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంధమల్ల ప్రాజెక్టు కాళేశ్వరంలో అంతర్భాగమని అన్నారు. ఇన్ని రోజులూ కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టడంతో అన్నీ అబద్ధాలే మాట్లాడారని తేలిపోయిందని అన్నారు. రేవంత్ రాజకీయాల కోసమే కాళేశ్వరం పై తప్పుడు ప్రచారాలు చేశారని ప్రజలకు అర్థమైందని అన్నారు. ‘మూసీ నదిలో సైతం గోదావరి జలాలు తీసుకొస్తానని అంటున్నావు&అవి కూడా కాళేశ్వరం జలాలే’ అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను స్టే ఇచ్చి ఆపింది అప్పటి సిఎం కెసిఆరే అని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి అక్కడి సిఎం చంద్రబాబును కలిసి బజ్జీలు తినవచ్చారే తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

ఆంధ్రకు దాసోహం చేసి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలను ఎండబెట్టింది కాంగ్రెస్ సర్కారేననని ఆరోపించారు. తాత్కాలిక కేటాయింపుల ప్రకారం 65 టిఎంసిలు తక్కువ వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెసే అని మండిపడ్డారు. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోవడం పంట ఎండబెట్టడమేనని, దీనికి సమాధానం చెప్పాలని లేకుంటే చెంపలేసుకుని ముక్కు నేలకు రాయాలని ఉత్తమ్‌కు సూచించారు. గోదావరి, బనకచర్ల మీద ప్రిపేర్ కాలేదని అంటున్న మంత్రి ఉత్తమ్ ఎంత బాధ్యతరాహితంగా ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. బనకచర్ల ద్వారా తెలంగాణ గోదావరిలో వాటా కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 400 టిఎంసిల గోదావరి జలాలను అక్రమంగా ఎపికి తరలిస్తుంటే గుడ్లప్పగించుకొని చూడడం ఏమిటని ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని, కేంద్ర మంత్రులను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌లో సిఎం రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని, దీనికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా అంతర్ రాష్ట్ర అనుమతులు లేకుండా గోదావరి ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎపి సిఎం చంద్రబాబును ఎదిరించే దమ్ము, సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే బిఆర్‌ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తుందన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బిజెపి నాయకులు ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు బిజెపి నేతలకు పట్టవా అని అన్నారు.

ఉద్యోగులను ఊరించిన కాంగ్రెస్ :
ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించి, అధికారంలోకి వచ్చాక ఉసురు తీస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గాలిమోటార్‌లో తిరుగుడు.. గాలి మాటలు మాట్లాడడం తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసిందేమీ లేదన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్లో ఏదో చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు, ఉద్యోగులకు తీవ్రమైన నిరాశ మిగిలిందన్నారు. విలేకరుల సమావేశంలో దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంఎల్‌సి ఫారూఖ్ హుస్సేన్, పార్టీ నాయకులు రాజమౌళి, గన్నే వనిత, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News