దండుపాళ్యం బ్యాచ్లా ఇష్టారీతిలో పదేళ్లు రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం దోచుకుందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ది చెందుతుంటే విష పురుగులై అడ్డుపడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బిఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కొండా సురేఖ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజన్న కోడెలపై రాజకీయం చేయవద్దని, గడిచిన పదేళ్లలో వేములవాడ ఆలయానికి సంబంధించి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ఘటనపై స్పందించి బాధ్యతాయుతంగా చర్యలు తీసుకున్నామని అయినా బురద రాజకీయాలు చేస్తూ బిఆర్ఎస్ నాయకులు దిగజారుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేసేముందు పదేళ్ల దుర్మార్గ పాలనపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె హితవుపలికారు. వేములవాడ రాజన్న ఆలయానికి కెసిఆర్ ఇచ్చిన హమీల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు.
నేటి కోడెల దుస్థితికి కెసిఆర్ పాలనే కారణమని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విజయవం తంగా పుష్కరాలు నిర్వహించిందని, 30 లక్షల మంది భక్తులు పుష్కరాలకు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలగలేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ భద్రకాళి ఆలయ విస్తరణ నిర్మాణ పనులను కోట్ల రూపాయలతో చేపట్టామని ఆమె పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మీద కెసిఆర్ బొమ్మలను చెక్కించుకున్న బిఆర్ఎస్ నాయకులు దేవుళ్ల విషయంలో మాట్లాడే అర్హత లేదని మంత్రి కొండా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాదగిరిగుట్టకు రూ. 63 కేజీల బంగారు గోపురం తాపడం చేయించినట్లు మంత్రి గుర్తు చేశారు. సామూహిక కోటి దీపోత్సవం, నదీహారతి, కాళేశ్వరం, యాదగిరి గుట్టలకు మహా కుంబాభిషేకం చేశామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దేవాదాయ శాఖలో అభివృద్ది జరిగిందా, బిఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసిందా అని మంత్రి నిలదీశారు.
సిఎం రేవంత్రెడ్డి మాస్టర్ ప్లాన్తో రాజన్న ఆలయ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక్కో నెలలో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో కోడెలను ఇచ్చి వెళతారని, కొన్ని సార్లు అనారోగ్యంగా ఉన్న కోడెలను వదిలి వెళ్లిన దాఖలాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో జరిగిన సంఘటనలను రాద్దాంతాం చేసే వారు సిగ్గుపడాలన్నారు. కోడెలు జబ్బుపడ్డప్పుడు సంరక్షించేందుకు 12 మంది పశువైద్య అధికారులను నియంమిచినట్లు ఆమె గుర్తు చేశారు. గోవులను కాపాడాలని, ఆలయాన్ని అభివృద్ది చేయాలని ప్రభుత్వం చిత్త శుద్దితో ఉందని ఆమె స్పష్టం చేశారు. వేములవాడలో విశాలమైన గోశాల ఏర్పాటుకు స్థలం పరిశీలించాలని సిఎం సూచించారన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో ఎన్కేపల్లిలో గోశాల ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంతి ఆదేశించినట్లు మంత్రి కొండా తెలిపారు.