కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందించిన వెంటనే బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కమిషన్ రిపోర్టుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయపబ్బం గడపవద్దని ఆయన హెచ్చరించారు. శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తర్వాత ఎంపి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నానని, కణత మీద తుపాకి పెట్టినా విలువలు పోగొట్టుకోనని వ్యాఖ్యానించారు. మాజీ సిఎం కెసిఆర్ వందల సార్లు కాళేశ్వరం సృష్టికర్త తానే నని చెప్పుకున్నారని, ప్రాజెక్టుపై ఆయన నిర్ణయం తీసుకున్నారు. దానిని క్యాబినెట్ తో ఆమోదింపజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, ఖర్చులు ఆర్ధిక శాఖకు ఎలాంటి సంబంధం లేదని ఎంపి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
జస్టిస్ పిసి ఘోష్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే దానికి వెల్లడించాలని, అందులో పేర్కొన్న దోషులను ప్రభుత్వం శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మా బతుకు పారదర్శకంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలే నిజమైన న్యాయనిర్ణేతలు, బట్టకాల్చి మీద వేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. భారతీయ జనతాపార్టీ చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే పార్టీ అంటూ కాళేశ్వరం కమిషన్ నివేదికను వీలైనంత త్వరగా బయటపెట్టిదోషులను వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధ్యులను శిక్షించకపోతే కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదన్నారు.