ఖైరతాబాద్ మహాగణపతి కర్రపూజ భక్తుల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపన కర్ర పూజ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కర్ర పూజలో ఎంపీ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్రావు పాల్గొన్నారు. రెండు ఉత్సవ కమిటీల అధ్యక్షుడిగా దానం నాగేందర్ నేతృత్వంలో కర్ర పూజ జయప్రదంగా ముగిసింది.
ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు 71 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. 2025 గణపతి రూపాన్ని శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా రూపొందిస్తున్నారు. మహాగణపతికి కుడి వైపు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దర్శనమిస్తే.. ఎడమవైపు లలిత త్రిపురసుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి కొలువై ఉంటారు. ఉత్సవ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేశారు. భక్తులకు విశేషంగా ఆకర్షించే విధంగా రూపొందిస్తున్న ఈ గణేశ్ విగ్రహం నిర్మాణం త్వరలో ప్రారంభమవనుంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ఉత్సవ కమిటీలు సిద్ధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.