Sunday, June 8, 2025

త్వరలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు

- Advertisement -
- Advertisement -

ఎలాన్‌మస్క్ కంపెనీకి కేంద్ర
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ లైసెన్స్‌లు
జారీ చేసిన టెలికాం విభాగం
దరఖాస్తు చేసుకున్న 1520
రోజుల్లోనే ట్రయల్ స్పెక్ట్రమ్

న్యూఢిల్లీ : అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత టెలికాం మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్ పొందింది. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్టార్‌లింగ్‌కు టెలికాం శాఖ (డాట్) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టార్‌లింక్ త్వరలో దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఉపగ్రహ ఆధారిత హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. గతంలో భారతీ ఎయిర్‌టెల్ వన్‌వెబ్, రిలయన్స్ జియో భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత సేవలను అందించడానికి ఆమోదం పొందాయి. ఇప్పుడు స్టార్‌లింక్ శాటిలైట్ సేవలకు ఆమోదం పొందిన మూడో కంపెనీగా అవతరించింది. నాలుగో కంపెనీ అమెజాన్‌కు చెందిన క్విపర్ కూడా లైసెన్స్ కోసం వేచిచూస్తోంది. అయితే స్టార్‌లింక్ లైసెన్స్‌ను పొందిందని, కంపెనీకి 15 నుంచి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేయనున్నామని శుక్రవారం డాట్ అధికార వర్గాలు వెల్లడించాయి.

స్పెక్ట్రమ్ కేటాయింపు తర్వాత భద్రతా పరిస్థితులతో సహా అన్ని సమ్మతులను కంపెనీ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, భారతదేశంలో ఉపగ్రహ టెలికాం సేవలను ప్రారంభించే ముందు కంపెనీ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్‌స్పేస్) నుండి కూడా అనుమతి పొందవలసి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే దీని కోసం అన్ని వివరాలను అందించింది, కానీ ఇంకా ఆమోదం పొందలేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సుల తర్వాత ఇప్పుడు డాట్ స్పెక్ట్రమ్ కేటాయింపు ధర, సంబంధిత నియమాలను ఖరారు చేయాల్సి ఉంది. మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగంగా విభేధాలు బయటపడిన తర్వాత కొద్ది గంటల్లో లైసెన్స్ మంజూరు అయింది. గత వారం ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వ విభాగం నుంచి వైదొలిగిన తర్వాత ట్రంప్‌తో దూరం పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News