స్వచ్ఛమైన ప్రేమానురాగాలు, అభిమానం, ఆప్యాయతలే స్నేహానికి పెట్టుబడులు. అది కాదని, పరస్పర స్వార్థ ప్రయోజనాలను ఆశించి చేసే స్నేహబంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగులుతుంది. ఇందుకు డొనాల్డ్ ట్రంప్ -ఎలాన్ మస్క్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిన్నటివరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ స్నేహితులు ఇప్పుడు ఉప్పూనిప్పూలా మారి, ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
తన మద్దతు లేకుంటే, ఈసారి ట్రంప్ గెలిచేవారు కాదని మస్క్ అంటే, టెస్లా వ్యాపార విస్తరణకోసం మస్క్ ఒత్తిడి తెచ్చారని, తాను అంగీకరించకపోవడంతో ఇప్పుడు తనతో విభేదిస్తున్నారని ట్రంప్ అంటున్నారు. నిజానికి ఈ ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఎప్పుడూ లేదు. ఒకప్పుడు ట్రంప్ పేరు చెబితేనే మస్క్ మండిపడేవారు. అధ్యక్ష పదవికి ట్రంప్ సరిపోరని బాహాటంగానే విమర్శించేవారు. ఇదంతా 2016 నాటిమాట. ఆ తర్వాత ట్రంప్ గెలిచే సూచనలు ఉన్నాయని పసిగట్టిన మస్క్, ఆయనకు దగ్గరయ్యారు. ట్రంప్ గెలిచీ గెలవగానే ఆర్థిక సలహా మండలిలో సభ్యుడిగా మస్క్ను నియమించారు. అయితే పారిస్ వాతావరణ ఒప్పందంనుంచి అమెరికా తప్పుకోవాలన్న ట్రంప్ నిర్ణయంతో విభేదించారు. ఈ చర్య అమెరికాకు నష్టం కలిగిస్తుందంటూ ప్రకటించి, పదవినుంచి వైదొలగారు.
ఐదేళ్ల తర్వాత మరొకసారి వీరి మధ్య స్నేహబంధం చివుళ్లు వేసింది. ఈసారి కూడా స్వార్థ ప్రయోజనాలే అందుకు కారణమయ్యాయి. టెస్లా కంపెనీ విస్తరణ కోసం మస్క్, ఎన్నికల ప్రచారంలో నిధులకోసం ట్రంప్ దగ్గరయ్యారు. ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్తో మస్క్ను పోలుస్తూ ప్రపంచం గర్వించదగిన మేధావులలో ఆయన ఒకరంటూ అప్పట్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపట్ల మేధావివర్గం ముక్కున వేలేసుకుంది. ఈసారి కూడా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మస్క్కు కీలకమైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూలమైన మార్పులు చేయడం ద్వారా ఖర్చులు తగ్గించడమే ఈ విభాగం లక్ష్యం. ప్రభుత్వ వ్యయాన్ని 2 లక్షల కోట్ల మేరకు తగ్గిస్తానని శపథం బూనిన మస్క్ గత ఆరు నెలల్లోనే వేలాది ఫెడరల్ ఉద్యోగుల పొట్టగొట్టడమే కాకుండా, ఎన్నో ప్రభుత్వ శాఖలను మూసివేయించారు.
అయితే అకస్మాత్తుగా డోజ్ పదవికి ఆయన రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. అమెరికా చట్టాల ప్రకారం ఎవరికీ 130 రోజులకుమించి ఈ హోదాను ఇవ్వకూడదు. అందువల్లనే మస్క్ వైదొలగుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగినా, ట్రంప్తో పొసగడం లేదని, అందుకే మస్క్ రాజీనామా చేస్తున్నారని అప్పట్లోనే వార్తలు గుప్పుమన్నాయి. అది నిజమేనని తదనంతర పరిణామాలు రుజువు చేశాయి. ట్రంప్ ఇటీవల పట్టుబట్టి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ కు నిరసనగా మస్క్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ బిల్లుకు ఇటీవల కాంగ్రెస్ దిగువ సభ ఆమోదం కూడా తెలిపింది. వ్యయ నియంత్రణకోసం డోజ్ పనిచేస్తుండగా, వ్యయాన్ని పెంచే ఈ బిల్లును తీసుకువచ్చినందుకు ఆయన తీవ్రస్థాయిలోనే నిరసన వ్యక్తం చేశారట. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లని మొండిగా వాదించే ట్రంప్ బిల్లును వెనక్కి తీసుకోవడానికి ససేమిరా అంగీకరించకపోవడంతో ఇద్దరికీ మధ్య చెడింది.
దీనిపై మస్క్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ బిల్లును ఆమోదించినందుకు కాంగ్రెస్ దిగువ సభ సభ్యుల్ని కూడా తప్పుపట్టారు. ‘ఇది చాలా చెడ్డ బిల్లు. అయినా ఓటేశారంటే అది మీకే అవమానం’ అంటూ విమర్శించారు. ఈ బిల్లు కారణంగా ద్రవ్యలోటు 2.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఓపెన్ ఎఐ అనే కృత్రిమ మేధ సంస్థకు, యుఎఇకి మధ్య ఒప్పందాన్ని మస్క్ నిరసించినా, ట్రంప్ పట్టించుకోకపోవడం కూడా ఇద్దరి మధ్య దూరం పెరిగేందుకు కారణమైంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు.
ట్రంప్తో విభేదించడంతో మస్క్కు చెందిన టెస్లా కంపెనీ మార్కెట్ విలువ 152 బిలియన్ డాలర్ల మేరకు తరిగిపోయింది. ఈ ఇద్దరి మధ్య గొడవల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతున్నాయి. ట్రంప్- మస్క్ల మధ్య ‘కాల్పుల విరమణ’ కు మోడీ ప్రయత్నించాలంటూ పలువురు నెటిజన్లు సరదాగా చేస్తున్న కామెంట్లు కార్యరూపం దాల్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే, స్నేహం ముసుగులో స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడే ఈ ఇద్దరు పెద్ద మనుషులు మళ్లీ ఎప్పుడైనా ఒకటికావచ్చు!