అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పాలన నడుస్తోందని వైసిపి నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వ్యవస్థలన్నీ నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారని, పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని గుర్తు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్త లక్ష్మీ నారాయణను సజ్జల, ఆ పార్టీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు.
రక్షించేవారే అరాచక శక్తులుగా మారారని, శాతవాహన కాలేజీని కూల్చేశారని, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయన్నారు. సమర్థులైన అధికారులను విఆర్లో ఉంచుతున్నారని తెనాలిలో దాడి చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సజ్జల ప్రశ్నించారు. పొలిటికల్ బాస్లు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎవరైనా పోలీస్ స్టేషన్కు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు.