కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు వంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతామన్నారు. “మేం భయపడ్తున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారు?.. కమిషన్ ముందు హాజరై వాస్తవాలను ఉంచుతాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తాం” అని అన్నారు.
దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్ రావు అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని.. 2009 ఎన్నికల ముందు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాలో కొబ్బరికాయలు కొట్టి.. నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారని.. నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం పక్కన పెడితే ఎనిమిది ఏండ్లు అయినా ప్రాజెక్టుకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదని హరీష్ రావు విమర్శించారు.