న్యూఢిల్లీ: ప్రపంచదేశాలను గడగడలాడించిన కరోనా మరోసారి భారత్లో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,131 కోవిడ్ (Covid-19) కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. ఆదివారం ఉదయం 8 గంటల నాటికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133గా ఉన్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం కేరళలో 1950, గుజరాత్లో 822, బెంగాల్లో 693, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఎపిలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ (Covid-19) కారణంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మృతి చెందారు. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు మొదలయ్యాయి.
కేరళలో గత 24 గంటల్లో 192 కేసులు నమోదు కాగా.. గుజరాత్లో 107, బెంగాల్లో 58, కర్ణాటకలో 15, ఆంధ్రప్రదేశ్లో 12 కొత్త యాక్టివ్ కేసులు వెలుగుచూశాయి. అత్యధిక పాజిటివ్ కేసుల్లో కూడా కేరళ ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రామ్ సబ్వేరియంట్లు, లీనియేజ్లు అప్పర్ రెస్పిరేటరీ పైనే ప్రభావం చూపుతుంన్నందున ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.