పార్టీలకు అతీతంగా ఆయన్ను గౌరవిస్తారు
జంటనగరాల్లో కష్టం వస్తే గుర్తుంచుకునే
వ్యక్తుల్లో దత్తాత్రేయ ఒకరు ఎన్ని పదవులు
అధిష్టించినా ప్రజలకు దూరం కాలేదు
లేఖలు రాయడంలో ఆయన ఓ బ్రాండ్
అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ప్రశంసలు ‘ప్రజల కథే నా ఆత్మకథ’
పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి
కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
నాయుడు, గవర్నర్లు, సిఎం రేవంత్ సహా
పలువురు రాజకీయ ప్రముఖులు
మన తెలంగాణ/హైదరాబాద్: నా స్కూల్ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో, ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నానని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఎప్పుడు దా చుకోలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం పూర్తవగానే దత్తాత్రేయ పుస్తకావిష్కరణ కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. అజాత శత్రువు అంటూ పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నామని, దత్తన్నను చూస్తే అజాత శత్రువు మన ముందే ఉన్నారని కొనియాడారు. హర్యానా గవర్నర్, సీనియర్ రాజకీయవేత్త బండా రు దత్తాత్రేయ రచించిన ఆటోబయోగ్రఫీ ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాదులోని శిల్పక ళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఆయన జీవితంలో ఎన్నో పదవులు అధిష్టించినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదని అన్నారు. దత్తాత్రేయతో వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహిత సంబంధం ఉందని, ఆయన్ని నేను చాలా దగ్గరగా చూశానని చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా బండారు దత్తాత్రేయపై ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గదని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని రేవంత్రెడ్డి ప్రశంసించారు.
రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు చూసినప్పటికీ దత్తాత్రేయ ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్ వరకు ఎదిగారని కొనియాడారు. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లో ఆయన భాగం అయ్యేవారని గుర్తు చేశారు. దత్తాత్రేయ, కిషన్రెడ్డి కుటుంబాలతో తనకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని అభివర్ణించారు. ఆయన శైలి, విధానాల నుంచి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు నేర్చుకోవాలని సూచించారు. జంటనగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చేది ఇద్దరే ఇద్దరు నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ అని రేవంత్ రెడ్డి అన్నారు. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్ కోసం తమకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. తమ నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుందని అన్నారు. దేశ స్థాయిలో అటల్ బిహారీ వాజ్ పేయిలా రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ ఉన్నారని పొగిడారు.
లేఖలు రాయడంలో దత్రాత్రేయ బ్రాండ్ అంబాసిడర్ : ఏపి సిఎం చంద్రబాబు
బండారు దత్తాత్రేయ నిబద్ధత, నిరాడంబరత, ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న అంకితభావం చాలా గొప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయన రచించిన ‘ప్రజల కథే..నా ఆత్మకథ’ పుస్తకం భావి తరాల నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. దత్తాత్రేయ జీవితంలోని ఒడిదొడుకులు, విజయాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రభుత్వానికి లేఖలు రాయడంలో దత్రాత్రేయ బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబునాయుడు కొనియాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని లేఖలు రాశారో నాకే తెలియదని గుర్తు చేసుకున్నారు. దత్రాత్రేయ వంటి సీనియర్ ప్రజా సేవకుల జీవితానుభవాలను గ్రంథస్థం చేయడం సమాజానికి ఎంతో అవసరమని, వారి కథనాలు మార్గదీపికలుగా ఉపయోగపడతాయని చంద్రబాబు పేర్కొన్నారు. దశాబ్దాల ప్రజాజీవితంలో దత్తాత్రేయ సాధించిన విజయాలు, ఆయన వ్యక్తిగత మైలురాళ్లు, సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ఈ పుస్తకం కళ్లకు కట్టినట్లు కడుతుందని అభిప్రాయపడ్డారు.
ఎంతో మందిని నాయకులుగా తీర్చి దిద్దిన ఘనత దత్తాత్రేయకే దక్కుతుంది:కిషన్రెడ్డి
ఎంతో మంది యువకులను గొప్ప నాయకులుగా తీర్చి దిద్దిన ఘనత బండారు దత్తాత్రేయకే దక్కుతుందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. తాను ను ఈ రోజు ఈ స్థానంలో ఉండటానికి ఆయనే కారణమని, – రాజకీయాల్లో దత్తాత్రేయ నా వేలు పట్టి నడిపించారని గుర్తు చేసుకున్నారు. దత్తాత్రేయ గారితో కలిసి ఎన్నో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని కిషన్రెడ్డి అన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తాను ఎంపీగా గెలవడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. సేవా భారతి కార్యక్రమం ద్వారా బస్తీల్లో ఆయనతో పాటు సేవ చేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. పార్టీ విస్తరణకు నగరంలో దత్తాత్రేయ ఎంతో కృషి చేశారని తెలిపారు. పార్టీ కార్యకర్తగా, పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా అన్ని స్థానాల్లో హుందాతనంగా వ్యవహరిస్తూ ఆ పదవులకు వన్నె తెచ్చారని అన్నారు. దత్తాత్రేయ గారి పుస్తకాన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ చదవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రాజకీయాల్లో విలువలు పెంచుతూ, నాయకత్వ లక్షణాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సిద్ధాంతాలు వేరైనా కూడా దత్తాత్రేయ ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకరినొకరిని గౌరవించుకొని తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఒడిస్సా గవర్నర్ హరిబాబు, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఏపి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు.
జీవిత కథ యువతను నిబద్ధతతో, వినయంతో ప్రజాసేవ వైపు నడిపించాలి: దత్రాత్రేయ
తన ఆత్మకథ గురించి గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తన జీవిత కథ యువతను నిబద్ధతతో, వినయంతో ప్రజాసేవ వైపు నడిపించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది తన సామాన్య జీవితం నుండి అత్యున్నత రాజ్యాంగ పదవుల వరకు సాగిన ప్రయాణానికి హృద్యమైన కథనమని తెలిపారు. తన తల్లి దివంగత ఈశ్వరమ్మ తనకు నేర్పిన సానుభూతి, అంకితభావం, సేవా విలువలే తన జీవితాన్ని, వృత్తిని తీర్చిదిద్దాయని ఆయన గుర్తు చేసుకున్నారు. తన జీవితం గొప్ప మలుపు తిరగడానికి కారణం ఒకే ఒక వ్యక్తి ఆయనే డాక్టర్ మనోజ్ షిండే అని చెప్పారు. ఆయన ప్రోత్సాహంతోనే ఆర్ఎస్ఎస్లోకి అడుగు పెట్టానని తెలిపారు. రాయిని, రప్పను శిల్పంగా మార్చినట్లు ఆయన ఆర్ఎస్ఎస్లో చురుకైన కార్యకర్తగా తనను తీర్చి దిద్దారని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవితం, ప్రాణం, అవయవాలు, దేహం అంతా ఆర్ఎస్ఎస్దేనని భావోద్వేగంతో వెల్లడించారు. బిజెపి నేత, మాజీ గవర్నర్ స్వర్గీయ వి రామారావు, బంగారు లక్ష్మణ్లు తనను రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించారని చెప్పారు.
సమాజం కోసం పని చేసే తత్వాన్ని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడగలుగుతామని వివరించారు. బిజెపి కార్యకర్తల వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని, వారిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అంతకు ముందు అలయ్ బలమ్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యం, ప్రజా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా ఈ కార్యక్రమం నిలుస్తుందని అన్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరి వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానాన్ని పాఠకులకు అందిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటీవ మే నెలలో ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా దత్తాత్రేయ ఆత్మకథ హిందీ అనువాదం ‘జనతా కీ కహానీ – మేరీ ఆత్మకథ’ పేరుతో విడుదలైందని అన్నారు. దత్తాత్రేయ రాజకీయ, సామాజిక సేవను నిజాయితీగా పొందుపరిచిన ఈ పుస్తకం అప్పట్లో ప్రశంసలు అందుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తెలుగు పాఠకులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో నేడు తెలుగు అనువాదాన్ని విడుదల చేశారు. తెలుగు ప్రజలతో గవర్నర్కు ఉన్న లోతైన అనుబంధాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు.