ఆశావహులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా
మల్లికార్జున ఖర్గేను, కెసి వేణుగోపాల్లను కలిసిన
మంత్రి వివేక్ వెంకటస్వామి
మనతెలంగాణ/హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఖాళీగా ఉన్న మరో మూడు మంత్రి పదవుల్లో సామజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని, ఓసీ, ఇతర సామాజిక వర్గాల ఆశావహులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబంతో కలిసి ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు కెసి వేణుగోపాల్ను ఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ…. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపానని ఆయన చెప్పారు.
సామాజిక న్యాయం అమలు చేయాలని రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఖర్గే, కెసి వేణుగోపాల్లు తనకు సూచించారని ఆయన తెలిపారు. ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు తీసుకోచ్చేందుకు అందరూ పనిచేయాలని వారు సూచించారని ఆయన చెప్పారు. ఖర్గేకు తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని, ఐక్యంగా పనిచేసి పార్టీని ప్రజలకు చేరువ చేయాలని ఆయన తనకు దిశానిర్దేశం చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.
ఏ శాఖ కేటాయింపు చేసినా అది సిఎం నిర్ణయం మేరకు ఉంటుందని, ఏ శాఖ ఇచ్చినా మంచిగా పనిచేస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా తన పని తీరు ఉంటుందని, ఏ శాఖ కేటాయించిన తన తండ్రి కాకా సమర్థవంతంగా నిర్వహించడమే కాక ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని, తన తండ్రి అడుగుజాడల్లోనే పనిచేస్తానని వివేక్ వెంకటస్వామి మాటిచ్చారు.