Tuesday, June 10, 2025

ఇద్దరు చిన్నారులను మింగిన నీటి గుంత

- Advertisement -
- Advertisement -

ఇటీవల కురుస్తున్న వర్షాలు.. మృగశిరా కార్తె ఆగమనం.. ఏరువాక ప్రారంభంతో విత్తన సేద్యంతో తరించిపోతున్న ఆ కుటుంబాన్ని విధి మరోలా వెక్కిరించింది. అప్పటివరకు అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న తమ ఇంటి దీపాలను నీటి గుంత రూపంలో బలితీసుకుంది. అమ్మానాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ తలలో నాలికలా మెలిగే ఇద్దరు చిన్నారులు.. ఇక రారని తెలిసిన ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, బొమ్మన్‌పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుంభం ధరణి, సుధాకర్ యాదవ్ దంపతులకు అశ్విత్ కుమార్ (8), చేతన్ (6) కుమారులు. కూలీ, వ్యవసాయ పనులతో వచ్చే ఆదాయంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు.. మృగశిర కార్తె ఆగమనంతో వ్యవసాయ పొలాన్ని సాగు చేసేందుకు దంపతులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా సోమవారం దంపతులు.. తమ ఇద్దరు కుమారులతో పాటు పొలానికి వెళ్లారు. అక్కడ ఆ దంపతులు పత్తి విత్తనాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదే సమయంలో వీరి ఇద్దరు కుమారులు సమీపంలోని పొలం దగ్గర ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిని గమనిస్తూనే పొలం పనులు చేస్తున్నారు. పొలానికి అవసరమైన నీటిని అందించేందుకు నిల్వ కోసం గుంతను తవ్వి.. దానిపై కవర్ కప్పి ఉంచారు. దానికి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడి పోయారు. పొలం పనుల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించలేదు. చాలా సమయం వరకు తమ చిన్నారులు కనిపించక పోవడంతో ఆందోళన చెందారు. పొలం నలువైపులా వెతికినా వీరి జాడ కనిపించలేదు. దీంతో అనుమానంతో నీటి గుంతలో చూశారు. అప్పటికే అందులో పడిన చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. దీంతో ఒక్కసారిగా గుండెలవిసేలా తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతితో కుటుంబంతో పాటు.. గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకొన్నాయి. బాధిత కుటుంబాన్ని బిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, మాజీ సర్పంచ్ రాత్లావత్ బొడ్కా నాయక్, మాజీ ఎంపిపి రామనాథం తదితరులు పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News