మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టిసి లాభాల బాటలో నడుస్తోందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో సోమవారం ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాలుష్యం నుండి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణాన్ని కాపాడుకుంటూ ఆర్టిసి సంస్థ ముందుకు వెళ్తోందని అన్నారు. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అయినప్పటి నుండి ఆర్టిసిలో సమూల మార్పులు తెచ్చి అనేక సంస్కరణలతో ముందుకు వెళ్లడం శుభ పరిణామమని అన్నారు. గతంలో సామాన్యుడి అవసరాలు తీర్చేందుకు ఆర్టిసి సంస్థ ఎంతగానో కృషి చేసింది కానీ లాభాలు లేకుండా ఎప్పుడూ నష్టాల బాటలో కొనసాగిందని, కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆర్టిసిని కాపాడుకునేందుకు, ఆర్థికంగా నిలబెట్టేదుకు తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
పాత బస్సులు, డీజిల్ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేసేందుకు సూర్యాపేట డిపోకు 79 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, సోమవారం 45 ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో ఆడపడుచులు అందరూ ఆర్టిసి బస్సుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు ఉచితంగా తీసుకెళ్తున్నామని, ఇప్పటివరకు రూ.182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని, వాటి ద్వారా తెలంగాణ ఆడపడుచులు 6,088 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని అన్నారు. ఆ డబ్బులు ప్రభుత్వం ఆర్టిసికి నేరుగా జమ చేశామని, దానితో నేడు సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకొని పూర్తి సామర్థంతో రాష్ట్రమంతా బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చుట్టూ సూర్యాపేట.. నడుమ నల్లగొండ అంటూ తెలంగాణ సాయుధ పోరాటం గుర్తు చేసుకుంటూ ప్రజా ప్రభుత్వంలో మారుతున్న కాలానికి అనుగుణంగా, కార్మికుల సంక్షేమం కోరుకుంటూ నేడు సూర్యాపేట డిపోనుండి హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కోదాడ లాంటి ప్రాంతాలకి వాతావరణాన్ని కాపాడుకుంటూ 79 బస్సులు మంజూరు చేశామని తెలిపారు.
గత పదేళ్లలో ఒక్క నూతన బస్సు గానీ, కొత్త ఉద్యోగం గానీ ఇవ్వకుండా ఆర్టిసిని నష్టాల ఊబిలో కూరుకొనిపోయేలా చేశారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వేలాది కొత్త బస్సులు, ఉద్యోగాలు నియమించామని అన్నారు. ఆర్టిసిని పరిరక్షించుకుంటూ గ్రామాలకు రవాణా వ్యవస్థ చేరుకునేలా భవిష్యత్తులో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం నుండి వాతావరణాన్ని కాపాడుకునేందుకు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా సేవలు అందించి ఆర్థికంగా ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం ఉంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా ఎస్పి నరసింహ, ఎంఎల్ఎలు పద్మావతి రెడ్డి, మందుల సామేలు, ఎంఎల్సి శంకర్ నాయక్, పర్యాటక సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీనివాస్, జేబీఎం సంస్థ ప్రతినిధి ప్రభాకర్, ఆర్టిసి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.