కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ నివాసాల్లో ఎసిబి దాడులు
13చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన ఏసిబి
భవనాలు, ప్లాట్లు, ఇల్లు, వ్యవసాయ భూమి, బంగారం గుర్తింపు
బహిరంగ మార్కెట్లో రూ. 200 కోట్లకు పైగా విలువ
పలు హోటల్స్లో బినామిగా గుర్తింపు
అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన ఎసిబి అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ వలలో మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. కాళేశ్వరం ఈఈగా పనిచేసి, ప్రస్తుతం చొప్పదండి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు డివిజన్ 8లో ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్ నివాసాల్లో అవినీతి నిరోదక శాఖ (ఎసిబి) బుధవారం ఉదయం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో ఎసిబి నూనె శ్రీధర్ నివాసంతో పాటు హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, బెంగళూరు, చోప్పదండి తో పాటు 12 ప్రాంతాల్లో ఎసిబి అధికారులు తనిఖీ చేపట్టారు. కళ్లు చెదిరే విధంగా భారీగా ఆస్తులను గుర్తించింది. ప్లాట్లు, భవనాలు, ఇళ్లు,ఖరీదైన విల్లా, ఇళ్ల స్థలాలు, కార్లు, బంగారం, నగదు నిల్వలు, వ్యవసాయ భూములతో పాటు పలు హోటల్స్లో బినామిగా శ్రీధర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కరీంగనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు శ్రీధర్కు సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడు, సన్నిహితుల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 3,500 కోట్ల పనులు చేయించడం, నీటి పారుదల శాఖలో కీలకమైన నియామకాల్లో ఆయన పాత్రపైన అభియోగాల నేపథ్యంలో దాడులు నిర్వహించినట్లు సమాచారం. శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీ పనులను పర్యవేక్షించారు. అలాగే కాళేశ్వరంలో కీలకంగా ఉన్న గాయత్రి పంప్హౌస్ పనుల్లో శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వం బాహుబలి మోటార్లుగా భావించిన గాయత్రి పంప్హౌస్లను చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో నిర్మించింది.
భారీగా ఆస్తుల గుర్తింపు
బుధవారం ఉదయం ఈఈ నూనె శ్రీధర్ నివాసంలో జరిగిన ఏసిబి దాడుల్లో అధికారులు భారీగా స్థిర, చర ఆస్తులను గుర్తించారు. ఈ మేరకు ఏసిబి ఆస్తుల వివరాలను వెల్లడించింది. నూనె శ్రీధర్కు తెల్లాపూర్లో ఒక విల్లా, షేక్ పేటలో ఒక ప్లాట్, కరీంనగర్లో 3 ఇళ్లు, హైదరాబాద్ అమీర్పేటలో ఒక వాణిజ్య భవనం,హైదరాబాద్లో ఒక ఇల్లు, వరంగల్లో ఒక ఇల్లు, కరీంనగర్లో ఒక ఇల్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి,హైదరాబాద్లో అత్యంత విలువైన 19 ఇళ్ల స్థలాలు, వరంగల్, కరీంనగర్లో రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో నగదు డిపాజిట్లు గుర్తించింది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఎసిబి గుర్తించిన ఆస్తులను సీజ్ చేసి, శ్రీధర్ను అరెస్టు చేసిన ఏసిబి అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
అట్టహాసంగా కుమారుడి వివాహ వేడుకలు
ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టిన శ్రీధర్ తన కుమారుడి వివాహాం అంగరంగ వైభవంగా భారీ ఖర్చుతో జరిపించినట్లు తెలిసింది. మార్చి 2వ తేదీన ఓ ఫామ్ హౌస్లో శ్రీధర్ తన కుమారుడి హల్దీ, సంగీత్ ఫంక్షన్లు ఘనంగా నిర్వహించడమే కాకుండా మార్చి 6వ తేదీన థాయ్లాండ్లో కొడుకు వివాహం జరిపించారు. అలాగే మార్చి 9వ తేదీన నాగోల్లోని శివం కన్వెన్షన్ హాల్లో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు ఏసిబి సోదాల్లో బయటపడింది.