Saturday, June 14, 2025

రాజకీయ చదరంగం- కాళేశ్వరం

- Advertisement -
- Advertisement -

లక్ష ఎకరాల మాగాణి ఇదీ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి విధి ఎదురు తిరిగింది. ఏముంది ఉన్నట్టు ఉండి ఎన్నికలకు ముందు ప్రాజెక్టు కుంగింది. పరిస్థితులు తిరగబడ్డాయి. ప్రభుత్వం మారింది. విచారణలు, పెడబొబ్బలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రాజెక్టులో పెట్టిన లక్ష కోట్లు, దాని ఫలితం లక్ష ఎకరాల మాగాణి సాగు మాట ఎక్కడా కనిపిస్తలేదు. ప్రాజెక్టు పనికొస్తుందా లేదా పూర్తి స్థాయిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చడం లేదు. మరమ్మతులతో ప్రాజెక్టును రన్ చేస్తారా, మొత్తానికే అలంకారప్రాయంగా వదిలేస్తారా? మరో ప్రత్యామ్నాయం చూపిస్తారా అంటే ఎవరూ ఎటూ తేల్చడం లేదు. ఫలితంగా రెండేళ్ల నుండి ప్రాజెక్టు నుండి చుక్కనీరు వచ్చింది లేదు. ఎకరం మడికి నీరు పారింది లేదు.

మరి ఏం జరుగుతున్నదంటే కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ను రాజకీయ చదరంగంగా మార్చుకొని అన్ని పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టుతోనే భవిష్యత్‌ను వెతుకుంటున్నాయి. లక్ష కోట్లు రూపాయలు కెసిఅర్ దిగమింగి కాళేశ్వరం ప్రాజెక్టును కూళేశ్వరం చేసిండని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్నాయి. కానీ ఇప్పటి వరకు నిర్ధారించ లేదు, ఆ నిర్ధారణ కోసమే విచారణ కమిటీ వేసింది. అది పూర్తి కాకుండానే కేంద్ర మంత్రి బండి సంజయ్ సిబిఐ విచారణ కోరుతున్నారు. ఏ విచారణ జరిగినా బిఆర్‌ఎస్‌ను దోషిగా చూపిస్తూ ఆ పార్టీని లేకుండా చేస్తేనే మాకు గమ్యం ఉంటుందని కాంగ్రెస్, బిజెపి పాచికలు వేసి భవిష్యత్‌ను వెతుక్కుంటున్నాయి. ఈ చదరంగంలో ఎవరి పాచికలు ఎలా ఉన్నా రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీరు ఇవ్వడంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని ప్రజల ఆవేదన.

మేడిగడ్డ వద్దనే బ్యారేజ్ నిర్మిస్తే త్రివేణి సంగమంతో పుష్కలమైన నీరు ఉంటుందని, గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల అనుసంధానంతో వచ్చిన నీటిని ఒడిసిపట్టి ఉత్తర, దక్షిణ తెలంగాణకు నీరు ఎత్తి పోయవచ్చని మేడిగడ్డ బ్యారేజ్‌ని నిర్మించారు. దానికి సుందిల్ల, అన్నారంలను ఎత్తిపోతుల రిజర్వాయర్లుగా నిర్మించారు. 2015- 16లో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రపంచానికే తలమానికంగా ఉండాలని మూడేళ్లలో పూర్తి చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ సిఎం కెసిఆర్ హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రాజెక్టును చూపించిన కెసిఆర్ 2018 లో రెండోసారి అధికారం లోకి వచ్చి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సారు కారు పదహారు సీట్లు మావే అంటూ బోల్తాకొట్టారు. ఆ తర్వాత కూడా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అన్ని శాఖల నిధులను కుమ్మరించి రూ. లక్ష 20 వేల కోట్ల వరకు నిధులు ఖర్చు చేశారు.

2023 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు తెరలేపిన కెసిఆర్ మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఎకరాల మాగాణి సాగులోకి వచ్చిందని ప్రచారం చేస్తూ వచ్చారు. మూడేండ్లు వేరుగా గోదావరి నీటిని ఎత్తి పోసిన ప్రాజెక్టు ఎన్నికల ముందు ఒక్కసారిగా కుంగిపోయింది. అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, పనుల్లో నాణ్యత లేదని కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఆరోపిస్తున్న సందర్భంలోనే ప్రాజెక్టు కుంగిపోయి బిఆర్‌ఎస్ ప్రభుత్వ పతనానికి నాంది పలికింది. ఆ పతనం బిఆర్‌ఎస్‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ వేటను కాంగ్రెస్, బిజెపి పార్టీలు కొనసాగిస్తూ విచారణ ముగించకుండా ఎపిసోడ్‌ల రూపంలో కొనసాగిస్తున్నాయని పబ్లిక్ వర్షన్‌గా ఉంది. ప్రాజెక్టు పనికొస్తుందా, రాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ 2023 అక్టోబర్‌లో కుంగిన తర్వాత ఆ ప్రాజెక్టు పనికి రాదని మూడు పిల్లర్లు భూమిలోకి కుంగడం వల్లనే బ్యారేజ్ కుంగిందని, ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తే ప్రాజెక్టు కొట్టుకుపోతుందని ఎన్‌డిఎస్‌ఎ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది.

ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ లాగే సుందిల్ల, అన్నారం రిజర్వాయర్లు కూడా నీటిని నిల్వచేస్తే కూలిపోతాయని, ఈ ప్రాజెక్టులపై తుది నిర్ణయం వచ్చే వరకు ప్రాజెక్టును రన్ చేయకూడదని ఎన్‌డిఎస్‌ఎ తేల్చింది. ఆ నివేదిక అనంతరం ప్రభుత్వం మారడం, దానిపై కమిషన్ వేయడం ప్రాజెక్ట్ నిర్మాణం అధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలపై విచారణ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక విచారణలు జరిపిస్తున్నప్పుడు అది పూర్తి అయిన తర్వాతనే ప్రాజెక్ట్ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటారా, విచారణకు ప్రాజెక్టును రన్ చేయడానికి లేదా ప్రత్యామ్నాయం చూపెట్టడానికి ప్రస్తుతం ప్రభుత్వం పరిష్కారం చూపిస్తాయా అనేది ప్రజల్లో ఉన్న కోట్ల ప్రశ్నలు. రూ. లక్ష 20 వేల కోట్ల ధనం వెచ్చించి ప్రాజెక్టు నిర్మిస్తే అది పనికిరాదని పాలకులు పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మూడు పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు చేసి నీరు ఇవ్వొచ్చని బిఆర్‌ఎస్ అంటే అసలు ఆ ప్రాజెక్టు పనికి రాదని లక్ష కోట్లు కెసిఆర్ కుటుంబం దోచుకొని నాసిరకం ప్రాజెక్టును నిర్మించిందని ముఖ్యమంత్రి, ఇరిగేషన్, ఇతర మంత్రులు అంటున్నారు.

వీరి గోల ఎలా ఉన్నా విచారణతో సంబంధంలేకుండా ప్రాజెక్టు పనితీరు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వకు పనికిరాదని ఎన్‌డిఎస్‌ఎ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని అక్కడినుండి నాచురల్ ఫ్లోగా నీటిని తరలించవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే అందుకు సంబంధించిన పనులు మొదలుకాలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాజెక్టును చేపట్టక, ఇటు కాళేశ్వరం రిపేర్ చేయక రైతులను ఎండబెడుతున్నారనే విమర్శ ప్రభుత్వంపై ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో దక్షిణ తెలంగాణకు హైదరాబాద్ సిటీ తాగు నీటికి దేవాదుల కాకుండా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రతిపాదన చేశారు.

అందుకు సంబంధించి పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ తర్వాత సోనియా గాంధీ చేతుల మీదుగా కాంతనపల్లి వద్ద గోదావరి ఎత్తి పోతలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పనికి రాదంటే తుమ్మిడిహట్టి వద్ద ప్రత్యామ్నాయ ప్రాజెక్ట్ చేపట్టాలి. లేదంటే కాళేశ్వరం నుండే గోదావరి నీటిని ఎత్తిపోసి మిడ్‌మానేరు నుండి ఎస్‌ఆర్‌ఎస్‌పికి లింక్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు నీటితో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పంటలను కాపాడింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన దరిమిలా గోదావరి నీరు ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల చెరువుల ద్వారా నీరంది రెండు పంటలు చేతికొచ్చాయి. రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ ప్రభుత్వంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వల మరమ్మతులు, చెరువులు, కుంటకు అనుసంధానం చేయడం వల్ల ఆ నీటితో ఏటా రెండు పంటలు చేతికొచ్చాయి.

కామగోని శ్రీనివాస్,
(ఉమ్మడి వరంగల్ బ్యూరో)
(94401 07337)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News