Sunday, June 15, 2025

కెటిఆర్‌కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే:హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని అనడానికి కెటిఆర్‌కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కెటిఆర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి నోటీసులు పంపించారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలనలో డైవర్షన్ పాలిటిక్స్‌ను అమలు చేస్తూ బిఆర్‌ఎస్‌ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదని, రేవంత్ రెడ్డి డ్రామా, డైవర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని, పెట్టుబడులు కూడా వచ్చాయని తెలిపారు. తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా కెటిఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం నోటిసుల ప్రతాపం..? అని ప్రశ్నించారు. 2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషిచేసి నిర్వహించలేకపోయారని, అలాంటిది బిఆర్‌ఎస్ ప్రభుత్వం,కెటిఆర్ కృషి వల్ల ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్‌ను భారతదేశానికి అందులోనూ హైదరాబాద్‌కి తీసుకొని వచ్చారని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారని, అమర్ రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును, దేశ పరువును మంటకలిపిందని మండిపడ్డారు. అందాల పోటీతో లాభం లేదు కానీ రాష్ట్ర పరువు మాత్రం తీశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నందుకు కెటిఆర్‌కి ఎసిబి నోటీసులు ఇచ్చిందని స్పష్టమైతున్నదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని రకాలుగా వేధించినా ఆయన వైఫల్యాలను ఎండగట్టడం మాత్రం బిఆర్‌ఎస్ ఆపదు అని హరీష్‌రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News