ఉగ్రవాదంపై పోరులో చేయూత
పరస్పర సహకారం దిశలో పర్యటన
సాదర స్వాగతం పలికిన ప్రెసిడెంట్
రెండు రోజుల పర్యటనలో కీలక విషయాలు
తరువాతి దశలో కెనడా జి 7 సదస్సుకు హాజరు
నికోసియా : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుగా ఆయన ఇక్కడికి చేరారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ప్రధాని మోడీ విదేశీ పర్యటన చేపట్టడం ఇదే మొదటిసారి. రెండు దశాబ్ధాలలో భారత ప్రధాని ఒక్కరు ఈ మధ్యధరా దేశానికి రావడం ఇదే తొలిసారి. సైప్రస్ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధాని మోడీ దేశాధ్యక్షులు నికోస్ క్రిస్టోడైలిడెస్తో చర్చలు జరుపుతారని భారత అధికార వర్గాలు తెలిపాయి. ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఈ పర్యటన చేపట్టారు. 15, 16 తేదీలలో రెండు రోజుల పర్యటనకు సైప్రస్ వచ్చిన మోడీకి దేశాధినేత క్రిస్టోడౌలిడెస్ ఘన స్వాగతం పలికారు.
ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రధాని మోడీ ఇక్కడికి రావడంతో ఇరువురు నేతల మధ్య ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలపైనే చర్చలు .ఉంటాయని భావిస్తున్నారు. టర్కీ మరికొన్ని దేశాలు పాక్తో వంతపాడుతూ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోడీ సైప్రస్ నేతకు తెలియచేయనున్నారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాల పరస్పర సహకారం అత్యవసరం అని మోడీ అభిప్రాయపడ్డారు.ఇక్కడ రెండు రోజుల పర్యటన తరువాతి కెనడా , క్రొయోషియోలలో కలిపి మోడీ మొత్తం ఐదు రోజుల విదేశీ పర్యటన సాగిస్తారు. తన సైప్రస్ పర్యటన గురించి ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో తెలియచేసుకున్నారు.
తనకు సాదర స్వాగతం పలికినందుకు ఇక్కడి ప్రెసిడెంట్కు తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని స్పందించారు. వ్యాపార వాణిజ్య రంగాలు, సాంకేతిక విషయాలు, పెట్టుబడుల గురించి ప్రధానంగా చర్చలు ఉంటాయన్నారు. సైప్రస్ తరువాత ప్రధాని మోడీ ఈ నెల 17, 18 తేదీలలో కెనడా, క్రోయోషియాలకు వెళ్లుతారు. కెనడా పర్యటన అత్యంత కీలకం. సైప్రస్ భారత్కు మధ్యధరా ప్రాంతంలో అత్యంత సన్నిహిత దేశం అని, ఇయూ లో కూడా కీలకభాగస్వామ్యం అని ప్రధాని ఇక్కడికి రావడానికి ముందు ఢిల్లీలో స్పందించారు. వ్యాపార వాణిజ్య, పర్యాటక, పెట్టుబడులు, భద్రతా ఇతర కీలక రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాల పటిష్టత కీలకం అని ప్రధాని తెలిపారు. నికోసియాలో మోడీ ప్రెసిడెంట్తో చర్చలు జరుపుతారు. కాగా లిమాసాల్లో జరిగే వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొంటారు. భారత్లో భారీ పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తారు. కెనడాలోని కనన్స్కిలో జరిగే జి 7 సదస్సులో కూడా భారత్ తరఫున ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తారు.