రాజ్కోట్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన విజయ్ రూపానీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం రాజ్కోట్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. ఈ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలుస్తోంది. ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా రూపానీ పనిచేశారు.
సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు
ఇవాళ ఉదయం 11.30 గంటలకు మాజీ సిఎం భౌతికకాయాన్ని అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు విమానంలో రాజ్కోట్కు తీసుకెళ్లనున్నారు. రూపానీ భౌతికకాయాన్ని ఆయన ఇంట్లో దాదాపు గంటసేపు ఉంచి, సాయంత్రం ఊరేగింపుగా అంత్యక్రియలకు తీసుకువెళతారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఒక రోజు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినం
రూపానీ గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్ర సంతాప దినం ప్రకటించింది. “మాజీ సిఎం విజయ్ రూపానీ గౌరవ సూచకంగా జూన్ 16న (సోమవారం) గుజరాత్ అంతటా ఒక రోజు రాష్ట్ర సంతాప దినం పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినం సందర్భంగా జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగురవేస్తారు. ఇవాళ అధికారిక కార్యక్రమాలు ఉండవు” అని ప్రభుత్వ తెలిపింది.
డిఎన్ఎ పరీక్ష ద్వారా రూపానీ మృతదేహం గుర్తింపు
లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డాక్టర్ హాస్టల్ కాంప్లెక్స్ను ఢీకొట్టి కూలిపోయిన ఘటనలో మరణించిన 241 మందిలో రూపానీ కూడా ఉన్నారు. డిఎన్ఎ పరీక్ష ద్వారా ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 11.10 గంటలకు వచ్చిన నివేదికలో డీఎన్ఏ సరిపోలిక నిర్ధారణ అయిందని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.