Tuesday, June 17, 2025

అతి భారీ వర్షాలు.. కర్ణాటక, కేరళ, గోవాకు రెడ్ అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్ణాటక తీరప్రాంతం, కేరళ, గోవాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ సోమవారం భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాఖండ్‌లో వారం పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. వర్షాల కారణంగా తమిళనాడు, కేరళలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో, ఊటీ (ఉదగమండలం), కుంద, గూడలూర్, పండలూర్ తాలూకాలలోని పాఠశాలలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. ఇక, కేరళలో ఆదివారం నుండి చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 18 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఇప్పటికే ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్‌లు అమలులో ఉండగా.. మరో ఆరు జిల్లాలు ఆరెంజ్ అలర్ట్‌లో ఉన్నాయి. త్రిస్సూర్, పాలక్కాడ్, కన్నూర్, వయనాడ్, మలప్పురం, కొట్టాయం, కోజికోడ్, ఇడుక్కి, ఎర్నాకుళం, పతనంతిట్ట, కాసరగోడ్ జిల్లాల కలెక్టర్లు ఈరోజు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జూన్ 18 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News