అంతర్జాతీయ క్రికెట్లో జాతీయ జట్టులో స్థానం దక్కాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. కొందరికి ఆ అదృష్టం తొందరగా వస్తే మరికొందరి విషయంలో మాత్రం చాలా ఆలస్యమవుతుంది. కొందరు క్రికెటర్లకు జట్టులో ఒకసారి చోటు దొరికినా.. మళ్లీ ఛాన్స్ కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూడాలి. అలాంటి పరిస్థితే భారత క్రికెటర్ కరుణ్ నాయర్కి(Karun Nair) ఎదురైంది. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత కరుణ్ టీం ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెండు సంవత్సరాల క్రితం తనకు ఎదురైన ఓ ఘటనను అతను వెల్లడించారు.
ఓ స్టార్ క్రికెటర్ తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోమని చెప్పారని.. ఆర్థికంగా భరోసా కోసం విదేశీ టి-20 లీగ్లు ఆడమని సూచించినట్లు కరుణ్ (Karun Nair) పేర్కొన్నాడు. ఆ క్రికెటర్ చెప్పినట్లు చేయడం సులభమే కానీ, తన లక్ష్యం తిరిగి జాతీయ జట్టులో ఆడటమే అని అన్నారు. ఇప్పుడు తన విషయంలో అదే జరిగిందని అన్నాడు. ప్రస్తుతం కరుణ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇండియా-ఎ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన అనధికారిక మ్యాచ్లో అతను డబుల్ సెంచరీ సాధించాడు. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.