జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఓ ఉపాధ్యాయుడి నుండి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పి సాంబయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కన్నాయిగూడెం మండలం, లక్ష్మీపురం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురై అనారోగ్యంతో లీవ్ పెట్టాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత సిక్ లీవ్ పూర్తయి మళ్లీ తన పోస్టింగ్ కోసం డిఈఓ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఈ ఫైల్ కదలడానికి రూ.20 వేలు లంచంగా ఇస్తేనే రీ పోస్టింగ్ ఇస్తానని డిఇఒ డిమాండ్ చేశారు.
దీనికి సంబంధించిన ఆర్డర్ను తయారు చేసిన జూనియర్ అసిస్టెంట్ దిలీప్ రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 2024 అక్టోబర్ నుండి ఉపాధ్యాయుడు పాఠశాలలు మూసివేసే వరకు జిల్లా అధికారి కార్యాలయం చుట్టూ తిరిగాడు. మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఈనెల 12న కార్యాలయానికి రాగా, అధికారులు లంచం డిమాండ్ చేయడంతో డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక వరంగల్ ఎసిబి కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో వారి సూచనల మేరకు సోమవారం డిఇఒకు రూ.15 వేలు, దిలీప్కు 5 వేలు లంచం ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదిలావుడంగా, డిఇఒ కార్యాలయంలో సోదాలు చేయగా ఫిబ్రవరిలో తయారు చేసిన ఆర్డర్ను ఉపాధ్యాయుడికి ఇవ్వలేదని ఎసిబి డిఎస్పి తెలిపారు. పట్టుబడిన ఈడిఓ, జూనియర్ అసిస్టెంట్ను అదుపులోకి తీసుకుని, నగదు సీజ్ చేసి, ఇద్దర్నీ మంగళవారం వరంగల్ ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.