Wednesday, June 18, 2025

ఇష్టం లేని పెళ్లిళ్ల కారణంగానే హత్యలు!

- Advertisement -
- Advertisement -

మేఘాలయ ‘హనీమూన్ మర్డర్’ కేసు ఇటీవల సంచలనం సృష్టించింది. ఇండోర్ కు చెందిన సోనమ్, రఘువంశీల వివాహం జరగ్గా.. ఆ పెండ్లి ఇష్టం లేకపోవడంతో ప్రియుడితో కలిసి సోనమ్ భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మీరట్లో సౌరభ్ రాజ్పుత్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్ రాస్తోగి, ఆమె ప్రియుడు సహిల్ శుక్లా హత్య చేసి, శవాన్ని సిమెంట్ డ్రమ్లో దాచారు. కర్ణాటకలో ఒక మాజీ డీజీపీని ఆమె భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. యూపీ, ఢిల్లీ, బిహార్ ఇలా చాలా రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. భార్యలను హత్య చేస్తున్న ఘటనలు దేశంలో నిత్యకృత్యంగానే మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జీవితభాగస్వాముల మధ్య హత్యలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. అయితే ఇందులో 95 శాతానికి పైగా కేసుల్లో ఎవరికీ క్రిమినల్ రికార్డులు లేవు.

‘పెళ్లి-విడాకులు’ (Marriage -divorce) అనే రెండు అంశాలపై సామాజికంగా వస్తున్న ఒత్తిళ్లు సామాన్య పౌరులను సైతం నేరస్తులుగా మారుస్తున్నాయి. చిన్న సొల్యూషన్ తో పరిష్కారమయ్యే సమస్యలు కూడా హత్యల వరకు దారితీస్తున్నాయి.నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో డేటా ప్రకారం.. 2022లో భారతదేశంలో మొత్తం 28,522 హత్య కేసులు నమోదయ్యాయి, ఇందులో దాదాపు పది శాతానికి పైగా అంటే 2,821 కేసులు జీవిత భాగస్వామి లేదా భాగస్వామి ప్రోత్సాహంతోనే జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2022లో భార్యలు భర్తలను హత్య చేసిన, చేయించిన కేసులు 220కి పైగా నమోదయ్యాయి. అంటే ప్రతి 32 గంటలకు ఒక భర్త హత్యకు గురయ్యాడు. అదే సమయంలో భర్తలు భార్యలను హత్య చేసిన, చేయించిన కేసులు 270కి పైగా నమోదయ్యాయి. ఇందులో అదనపు కట్నం, వివాహేతర సంబంధాలు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి.

2023, 2024 సంవత్సరాలకు సంబంధించిన డేటాను ఇప్పటికీ ఎన్సీఆర్బీ విడుదల చేయలేదు. అయితే 2023, 2024లో కూడా జీవితభాగస్వాముల హత్యలకు సంబంధించి కేసులు వేల సంఖ్యలోనే నమోదై ఉంటాయని ఒక అంచనా. భారతదేశంలో 85 నుంచి 90 శాతం ఆరెంజ్జ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అందులో అబ్బాయి, అమ్మాయిల సమ్మతి తీసుకోకుండానే ఒత్తిడితో చేసిన వివాహాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. భారత సమాజంలో వివాహ బంధం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కంటే.. కుటుంబాల మధ్య ఒప్పందంగా భావిస్తారు. కులం, మతం, ఆర్థిక స్థితి, సామాజిక స్థాయిని బట్టి జీవిత భాగస్వాములను ఎంపిక చేస్తారు. అయితే ఎక్కువ శాతం పెళ్లిళ్లలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ సంబంధిత వ్యక్తికి ఇవ్వరు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా కుటుంబంపై ఆధారపడి ఉండడంతో వారికి నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ తక్కువగా ఉంటున్నది.చాలా మంది తమ అభిప్రాయాన్ని చెప్పలేక.. కుటుంబ సభ్యుల ఒత్తిడికి లొంగి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అందులో ఇమడలేక నిరాశ, ఒత్తిడి, ఒంటరితనానికి గురవుతున్నారు.

తమ జీవితంపై నియంత్రణ కోల్పోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలు గృహ హింసకు గురవుతున్న సందర్భాలు అనేకం. విడాకులు తీసుకోవడం తీవ్ర కష్టతరం కావడం, సమాజం ఏముంటుందోననే భావించి.. ఆ వివాహ బంధం నుంచి బయటపడలేక ఆందోళనకు గురవుతున్నారు. ఆ వివాహ బంధం నుంచి ఎలాగైనా బయటపడాలనే ఆతృతతో కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకొని నేరస్తులుగా మిగిలిపోతున్నారు. భారతదేశంలో విడాకుల ప్రక్రియలో అనేక సంక్లిష్టతలు ఉన్నాయి. పెండ్లి లాగే విడాకులు కూడా ఒక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా మారింది.ఇది విడిపోవాలనుకునే వారికి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నది. అంతేకాకుం డా విడాకులు తీసుకున్న మహిళలను సమాజం ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నది. విడాకుల తర్వాత మహిళలు ఒంటరితం, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్నారు. మహిళలు విడాకులు ఇచ్చిన పురుషులను సైతం చాలా మంది చిన్నచూపు చూస్తున్నారు.

అంతేకాకుండా భరణం చెల్లించా ల్సి వస్తుందనే కారణంతో భార్యలను పురుషులు హత్యలు చేస్తున్నారని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 2022 డేటా ప్రకారం భారతదేశంలో విడాకుల రేటు ప్రతి వెయ్యి మందికి 0.01 (వెయ్యి మందికి ఒకరు) మాత్రమే. 2020లో ఇది 0.022 ఉండగా, 2021లో 0.077 మాత్రమే ఉన్నది. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విడాకుల రేటు మెల్లమెల్లగా పెరుగుతున్నది. అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ శాతం చాలా తక్కువ. అయితే ఒక నివేదిక ప్రకారం 2023 వరకు దేశంలో సుమారు ఏడు లక్షలకు పైగా విడాకుల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. విడాకుల ప్రక్రియ సుదీర్ఘమైనది, ఖర్చుతో కూడుకున్నది కావడంతో.. ఈ జాప్యం వివాదాలను తీవ్రతరం చేసి హత్యల వరకు తీసుకెళ్తున్నదనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతున్నది.

దేశంలో జీవిత భాగస్వాముల హత్యలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. వీటి నివారణకు కేంద్రంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది. సమాజంలో మార్పు వస్తేనే ఈ హత్యల నివారణ సాధ్యమవుతుంది. ఒత్తిడితో కూడిన వివాహాలు భారతదేశంలో చట్టవిరుద్ధం. అయినా ఇది దేశంలో అమలు కావడం లేదు. ఇద్దరి సమ్మతి ఉంటేనే పెళ్లి చేయాలి. అబ్బాయి, అమ్మాయిల నిర్ణయాలను వారికుటుంబ సభ్యులు గౌరవించాలి.తమ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి. వైవాహిక సంఘర్షణలు, ఒత్తిడి, లేదా హింసాత్మక ధోరణులను నివారించడానికి జంటలకు మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలి.

వివాహ బంధం నుంచి బయటకు వెళ్లిపోయినా.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పథకాలను అమలు చేయాలి. పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చును భారీగా తగ్గించాలి. రిజిస్టర్డ్ మ్యారేజెస్ ను ప్రోత్సహించాలి. అంతేకాకుండా వివాహ బంధంలో ఇమడలేమని భావిస్తే.. ఆ బంధం నుంచి బయటపడేలా విడాకుల ప్రక్రియను సైతం సులభతరం చేయాలి. ముఖ్యంగా మహిళల కోసం, లీగల్ ఎయిడ్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలి. ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన న్యాయ సహాయం అందించాలి. విడాకులను ఒక వైఫల్యంగా చూడడం కంటే.. ఒక వ్యక్తి స్వాతంత్య్రం, ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన ఎంపికగా సమాజంలో ప్రచారం చేయాలి.

  • ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
    96404 66464
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News