మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో వధువు సోనమే తన ప్రియుడితో కలిసి రాజా రఘువంశీని హత్య చేసినట్లు నిర్ధారణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును దృష్టిలో పెట్టుకొని తాను మరో రాజా రఘువంశీ కాకుండా తప్పించుకున్నానని ఓ వరుడు పేర్కొన్నాడు. పెళ్లైన పది రోజులకే ప్రియుడితో తన భార్య వెళ్లిపోయిందన్నాడు. ఉత్తర్ప్రదేశ్లోని బదౌన్కు చెందిన సునీల్కు ఓ యువతితో మే 17వ తేదీన వివాహం జరిగింది.
ఆ తర్వాత అత్తింట్లో వధువు తొమ్మిది రోజులు గడిపింది. అనంతరం సాంప్రదాయ ప్రకారం పుట్టింకి వెళ్లిన ఆమె ఓ రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె సునీల్ తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసుల వద్దకు వచ్చిన వధువు ప్రియుడితో వెళ్లిపోయానని .. అతనితోనే తన తదుపరి జీవితం అని స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసి సునీల్ కూడా వాళ్ల ప్రేమకు అంగీకరం తెలిపారు.
పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత నైనిటాల్కు హనీమూన్ వెళ్లేందుకు ప్లాన్ చేశానని.. కానీ, ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని సునీల్ అన్నాడు. తాను మరో రాజా రఘువంశీ కాకుండా బతికి పోయానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాలు కూడా పరస్పర అంగీకారానికి రావడంతో కేసు సుఖాంతమైంది.