వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న భీకర వైమానిక దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ రహస్య బంకలోకి వెళ్లి దాకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో అమెరికాకు తెలుసని.. కానీ, ఇప్పటికీ ఆయనను చంపాలని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు.
ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో..” “సుప్రీం లీడర్” అని పిలవబడే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతను సులభమైన లక్ష్యం, కానీ అక్కడ సురక్షితంగా ఉన్నాడు. ప్రస్తుతానికి మేము అతన్ని బయటకు తీసుకురావాలనుకోవడం లేదు. కానీ, పౌరులపై లేదా అమెరికన్ సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు. మా ఓపిక నశించిపోతోంది” అని పేర్కొన్నాడు. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించారు.