సమతావాద స్వాప్నికుడు, సామాజవాద యాత్రికుడు, తెలంగాణ శాన్, కేశవరావు జాదవ్ (Keshavrao jadhav) కన్నుమూసి ఏడు సంవత్సరాలు కావస్తోంది. ఈ దేశానికి ఎటువంటి సోషలిజం కావాలో, దానికోసం సోషలిస్టు పార్టీ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉండాలో అనే విషయంపై రామ్ మనోహర్ లోహియా, లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ ఆలోచనలను, వాళ్ళ రచనలను వడపోసినవాడు జాదవ్ సార్. 1933 వ సంవత్సరంలో అసలు హైదరాబాద్ నగరంలోని హుస్సేని ఆలంలో జన్మించిన ఆయన తన వ్యక్తిత్వాన్ని, భావసమీకరణలను ఈ పట్టణంలోనే పదునుపెట్టుకొని, తెలంగాణ అంతా తానై వ్యాపించి, తెలంగాణ మట్టిలో మాణిక్యం, హైదరాబాద్ శాన్గా పరివర్తన చెందాడు.
పాతబస్తీలో పాఠశాల విద్య ముగిసిన తర్వాత, నిజాం కళాశాలలో, ఆ పై ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఎ చదివి అదే యూనివర్శిటీలో లెక్చరర్గా ఉద్యోగంలో చేరి అక్కడే పదవీ విరమణ చేశారు. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్శిటీలో పని చేసే ప్రతి అధ్యాపకుడు తప్పకుండా ఆ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఉన్న హన్మకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో పని చేయాలనే నియమం ఉండేది. విద్యార్థి దశనుండే జాదవ్ సామాజిక, రాజకీయ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడైనాడు. నిజాం కాలేజీలో విద్యార్థ్ధిగా ఉన్నప్పుడే నాన్ముల్కీ ఆందోళనలో పాల్గొన్నాడు. అంతకు ముందే నిజాం సర్కార్ దయానంద్ సరస్వతీ రచించిన సత్యార్థ ప్రకాశిక గ్రంథాన్ని నిషేధించడంతో కలత చెందాడు.
ఆర్యసమాజ్కు దగ్గరయ్యాడు. హై స్కూల్లో ఉండగానే డిఎస్యు విద్యార్ధి (Keshavrao jadhav) సంఘంలో చురుగ్గా పాల్గొనేవాడు. బహుశా ఈ వాతావరణం ఆయనను సోషలిస్టు సమాజ నిర్మాణ కృషికి బీజాలు వేసినట్టుంది. రామ్ మనోహర్ లోహియా వ్యాసాలు పూర్తిగా అధ్యయనం చేశాడు. ఆయనను చాలా దగ్గరగా చూడటం కాదు, ఆయన తోపని చేశాడు, కొద్ది కాలం ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా పని చేశాడు కూడా. ఆనాటి సోషలిస్టు నాయకులైన బి. సత్యనారాయణరెడ్డి, వైఎస్ రావు, ఠాకూర్ మహాదేవ్ సింగ్లతో చాలా సన్నిహితంగా ఉండి సోషలిస్టు భావాలు పంచుకున్నాడు. సోషలిస్ట్ పార్టీని బలో పేతం చేయడానికి కృషి చేశాడు. లాలూప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్లు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆయనతో రాజకీయాలు చర్చించేవారట.
అయితే భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పరచడానికి తహతహలాడిన జాదవ్ క్రమంగా ఆ పార్టీ బలహీనపడటం తాను తయారు చేసిన, ఆశలు పెట్టుకున్న వ్యక్తులు పలు రాజకీయ పార్టీలలోకి వెళ్ళిపోవడం ఆయనను బాగా నిస్పృహకు గురిచేసింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తన పాతమిత్రులతో స్నేహ సంబంధాలు పెట్టుకునేవాడు. అన్ని వామపక్ష పార్టీలతో ఆలోచనలు పంచుకునేవాడు. పోలీసుల అత్యాచారాలను, ఎన్కౌంటర్ పేరుతో నక్షలైట్ కార్యకర్తల హత్యలను ఎండగట్టాడు. తెలంగాణ ఉద్యమం ప్రథమ దశలో ఉన్న కాలంలో 17 సార్లు జైలుకు వెళ్ళాడు. 1979లో మెదక్ జిల్లా రుద్రారంలో ఆసియా దేశంలోనే అతిపెద్ద ఆల్ కబీర్ అనే పశువుల వధ్య శాల ప్రారంభం అయింది. తెలంగాణలోని పేద రైతులు కరువు, కాటకాల వల్ల పంటలు పండక నష్టాల బారినపడి, సరియైన నీటి పారుదల లేకపోవడం వల్ల, రుణభారం వల్ల వ్యవసాయం చేయడం కష్టమైపోయి పశువులు ఆల్ కబీర్ కంపెనీకి అమ్ముకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.
అప్పుడు ఆ ఫ్యాక్టరీని మూసివేయాలనే నినాదంతో ఆందోళనన మొదలైంది. ఆ ఆందోళనను ఒక ఉద్యమంగా ముందుకు నడిపించినవాడు జాదవ్ సార్. ఆ వధ్యశాలకు ఉన్న పేరును వాడుకొని కొన్ని హిందుత్వ గ్రూపులు హిందువులను ముస్లిం లకు వ్యతిరేకంగా రెచగొట్టే ప్రయత్నం చేసినప్పుడు జాదవ్ (Keshavrao jadhav) దాని స్థాపికులు గుజరాతీ, మార్వాడీ వ్యాపారస్థులు అన్న వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చి హిందుత్వ శక్తుల కుట్రలు పటాపంచలు చేసాడు. జయప్రకాశ్ నారాయణ 1979 అక్టోబర్లో పాట్నాలో మరణించాడు. ఆయన ఆరోగ్యం అసలే బాగా లేక ఢిల్లీలో హాస్పిటల్ లో ఉన్నప్పుడు, మే నెల తీవ్రమైన వేసవిలో ఢిల్లీకి జెపిని చూడటానికి జాదవ్ వెళ్ళాడట. కేశవ్ ఇంత ఎండలో అంతదూరం నుండి నన్ను చూడటానికి ఎందుకు వచ్చావని జెపి కోప్పడ్డాడట.
సార్ కళ్ళనీళ్ళు పెట్టుకొని జెపి నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు. ఈ స్థితిలో ఉన్న నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉంటాను అన్నాడట. జెపి, లోహియా లు సార్ను ప్రేమతో కేశవ్ అని సంభోదించేవారట. హైదరాబాద్లో మత సామరస్యం కోసం విశేషంగా కృషి చేశాడు. హైదరాబాద్ ఏక్తా సంస్థ ద్వారా మతకల్లోలాల్లో రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలను, వాళ్ళు ప్రేరేపించే ఆలోచనలను ఎండగట్టాడు. సార్కు పాత బస్తీ అక్కడి సంసృతి, అక్కడి అన్నివర్గాల ప్రజల జీవన విధానం అంటే చాలా ఇష్టం. ఉర్దూ చాలా ధారాళంగా మాట్లాడేవాడు, రాసేవాడు. 1980లో హైదరాబాద్ పాతబస్తీలో చెలరేగిన హింస, మత కల్లోలాల వల్ల సార్ స్నేహితుల భద్రత గురించి చాలా కలత చెందారు.
పాతబస్తీ వదిలి పెట్టి మూసీ ఇవతలి ప్రాంతానికి కుటుంబంతో వచ్చేయమని బాగా ఒత్తిడి చేశారు. సార్ మాత్రం ససేమిరా నేను ఇక్కడే ఉంటాను అన్నాడట. అప్పుడు కన్నాభిరాన్, ఎమ్టి ఖాన్, బూర్గుల నర్సింగరావు, బలవంత్ రెడ్డి సుల్తాన్ షాహి వెళ్ళి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి తీసుకొచ్చారు. ఇందిరా గాంధీ నియంత్రత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆమెకు వ్యతిరేకంగా మెదక్లో పోటీ చేశాడు. పలు మార్లు ఎన్నిక సమయంలో తాను విశ్వసించిన సోషలిస్ట్, ప్రజాస్వామిక భావాలు ప్రజల్లో ప్రచారం చేయడానికి ఎన్నికల్లో నామినేషన్ వేసే వాడు. ప్రజల కోసం, తాను నమ్మిన విలువల కోసం, నిజాయితీగా నిలబడ్డ కేశవరావు సార్తో నడవడం, ఆయనను ఇప్పుడు తలంచు కోవడం చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజాకవి కాళోజీని, ప్రొ. జయశంకర్ను సముచితంగా గౌరవవించడం జరిగింది.
ఎస్. జీవన్ కుమార్
(మానవ హక్కుల వేదిక)