రైతులపక్షాన మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత
కెసిఆర్ సారథ్యంలో త్వరలో ఉన్నతస్థాయి సమావేశం కాళేశ్వరంపై
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్షం, పాలమూరురంగారెడ్డి నిర్మాణంలో అలసత్వంపై
పోరుబాటకు వ్యూహరచన
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరపున బిఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కెసిఆర్ సారథ్యంలో త్వరలోనే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నది. బిఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యే ఈ ఉన్నతస్థాయి సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వం, రైతు వ్యతిరేక వైఖరిపై ప్రధానంగా చర్చిస్తారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు.
బిఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను కెసిఆర్ నాయకులకు వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో లక్షల ఎకరాల్లో రైతులకు సాగునీరు అందకుండా పోతున్న అంశాలను, రాజకీయ దురుద్దేశంతోనే అన్నదాతలపైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా ప్రభుత్వం చూపుతున్న అలసత్వం వలన తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందని, ఈ అంశంలో ఉద్యమ కార్యాచరణకు బిఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఏడాదిన్నర కాలంగా తెలంగాణ రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ఈ కీలక సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు సమగ్రంగా చర్చించనున్నారు.